నవతెలంగాణ – బల్మూరు
ప్రభుత్వం ప్రాతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిలో భాగంగా నిర్వహిస్తున్న గ్రామసభలు ఈనెల 4న ప్రారంభమై బుధవారంతో ముగిశాయి. మొదటిరోజు మండలంలోని పోలేపల్లి, పోలిశెట్టిపల్లి, చెన్నారం, మహాదేవపూర్, మంగళకుంటపల్లి, గట్టుతుమ్మన్ గ్రామాలలో గ్రామసభలు నిర్వహించారు. ఈనెల 6న జినుకుంట, కొత్తపల్లి, కొండారెడ్డిపల్లి, గోదల్, అనంతవరం గ్రామాలలో నిర్వహించారు. జిన్ కుంటలో జరిగిన గ్రామసభ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కేశవ్ పాటిల్ హాజరయ్యారు. 8న కొండనాగుల, మైలారం, వీరంరాజు పల్లి, రామాజీ పల్లి, తోడేళ్లగడ్డ, రామ్ నగర్ కాలనీలలో గ్రామసభలు జరగగా ఈనెల 10న బల్మూరు, లక్ష్మీ పల్లి, బాణాల, అంబగిరి, నర్సాయపల్లి గ్రామ పంచాయతీలలో గ్రామసభలు నిర్వహించారు.
గ్రామ సభలలో ప్రధానంగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునేవారు మరియు రెండో విడతలో తమకు ఇల్లు కావాలని కోరేవారు మొదటి విడతలో అర్హులైన వారికి ఇల్లు రాలేదని కొంత మంది లబ్దిదారులు వారి ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధులకు పెన్షన్లు సకాలంలో ఇవ్వాలని, కొత్త వారికి పెన్షన్లు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు. మండల కేంద్రం బల్మూరుతో పాటు మరికొన్ని గ్రామాలలో విద్యుత్తు స్తంభాలు అవసరమైన చోట వేసి వైరింగ్ గుంజడం మర్చారని సభలో పేర్కొన్నారు. గ్రామాలలో పశు వైద్య మరియు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు సక్రమంగా నిర్వహించాలని ప్రజలు కోరారు. లక్ష్మీ పల్లి బాణాల వంటి గ్రామాలలో తాగునీటి లీకేజీల కారణంగా నీరు కలుషితం అవుతుందని గ్రామసభలో తెలిపారు.
విద్యుత్తు అంతరాయం కూడా ఏర్పడుతుందని తెలిపారు. గ్రామాలలో సమస్యలు గుర్తించి అవసరమైన చోట ప్రతి గల్లీకి సిసి రోడ్లు మరియు డ్రైనేజీ సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరారు. పాఠశాలలు త్వరలో ప్రారంభం కానున్న దృష్ట్యా పాఠశాలలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. కొత్తగా రేషన్ కార్డులు తీసుకున్నవారు మరియు అర్హులైన వారికి ఇవ్వాలని, కొత్తవి అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ఉపాధి హామీ పనులు 100 రోజులకు కాకుండా ఎక్కువ రోజులు పెంచాలని, వారం వారం బిల్లులు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాలలో ప్రజలు గ్రామ సభల దృష్టికి తీసుకువచ్చారు.
ప్రజల సమస్యలను పరిష్కరించుకునేందుకు సాధ్యమైనంత మేర కృషి చేస్తామని సర్పంచులు తెలిపారు. అదేవిధంగా గ్రామాల అభివృద్ధికి తమవంతు సాయం అందిస్తామని, ప్రజలకు అందుబాటులో ఉంటామని అధికారులు హామీ ఇవ్వడంతో గ్రామసభలు ముగిశాయి. భవిష్యత్తులో గ్రామాలలోని సమస్యలు ఏ మేరకు పరిష్కారం అవుతాయో వేచి చూడవలసిందే..



