నవతెలంగాణ – హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ఆడియో క్లిప్ వైరల్ కావడంతో పార్టీ హైకమాండ్ సీరియస్గా స్పందించింది. మహిళలను కించపరిచేలా, అలాగే పార్టీ నాయకత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు రావడంతో ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
వైరల్ అయిన ఆడియోలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్తో పాటు మహిళలపై కూడా షబ్బీర్ అలీ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఆడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొట్టడంతో కాంగ్రెస్ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయడమే కాకుండా, అంతర్గత వ్యవహారాలను బహిరంగ చర్చకు తీసుకురావడంపై కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆయన నుంచి వివరణ కోరుతూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.



