– ఎం.డి. సయ్యద్
నవతెలంగాణ – ఆలేరు రూరల్
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని మందనపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.డి. సయ్యద్ తెలిపారు. ఆదివారం నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల నమోదు ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలోని తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న సౌకర్యాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల ద్వారా నాణ్యమైన విద్య అందించడంతో పాటు విద్యార్థుల్లో క్రమశిక్షణ, సామాజిక బాధ్యత, నైతిక విలువలు పెంపొందించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని చెప్పారు. ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజన పథకం, పరిశుభ్రమైన వాతావరణం వంటి అనేక సౌకర్యాలు ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్నాయని వివరించారు.



