లైఫ్ సైన్సెస్రంగంలో సుస్థిరాభివృద్ధి తెలంగాణలోనే సాధ్యం : బయోఏషియా సదస్సు ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
లైఫ్ సైన్సెస్రంగంలో సుస్థిరాభివృద్ధి తెలంగాణలోనే సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి ఏ రేవంత్రెడ్డి అన్నారు. దానికి అవసరమైన ప్రభుత్వ విధాన రూపకల్పన, వాతావరణం హైదరాబాద్ సొంతమని తెలిపారు. దీనివల్లే కేవలం రెండేండ్లలో జీవవిజ్ఞాన రంగంలో రూ.73వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని గుర్తుచేశారు. హైదరాబాద్లోని హైటెక్స్లో మంగళవారం బయో ఏషియా అంతర్జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరలోనే బయో ఏషియా తన పేరును దాటి బయో వరల్డ్గా మారుతుందనీ, దానికి కావల్సిన అన్ని సౌకర్యాలు, సంపద సృష్టిలో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యమవుతుందని స్పష్టంచేశారు. 23 ఏండ్ల క్రితం బయోఏషియా ప్రారంభమైనప్పుడు హైదరాబాద్కు ఉన్న గుర్తింపునకు, ఇప్పటికీ అనేక మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ ప్రపంచ వ్యాక్సిన్ తయారీ కేంద్రంగా నిలిచిందనీ, ఆనాటి దూరదృష్టి ఉన్న నాయకత్వం, స్పష్టమైన విధానాలు, నైపుణ్యంతో కూడిన మానవ వనరులు, ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు వంటి అనేక బలాల ఆధారంగా హైదరాబాద్ గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లకు, పరిశోధన, డిజైన్లో విశిష్టతకు ప్రపంచ కేంద్రంగా ఎదిగిందని వివరించారు.
ఇటీవలే దావోస్లో రాష్ట్ర ప్రభుత్వం తన కొత్త లైఫ్ సైన్సెస్ పాలసీని ప్రకటించిందనీ, జీనోమ్ వ్యాలీని విస్తరించామనీ గుర్తుచేశారు. ప్రపంచస్థాయి పరిశోధన, ఆవిష్కరణల కోసం ‘వన్-బయో’ను ప్రారంభించి, గ్రీన్ ఫార్మా సిటీని వేగవంతం చేస్తూ, అనేక గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లను ఆహ్వానించామని తెలిపారు. బయోఏషియా అంతర్జాతీయ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 500 ప్రముఖ సంస్థలకు చెందిన 4 వేల మందికి పైగా ప్రతినిధులు ఇక్కడ హాజరయ్యారనీ, వారందరికీ తెలంగాణ ప్రభుత్వం స్వాగతం పలుకుతున్నదని చెప్పారు. ఫార్మా, బయోసైన్సెస్, బయోటెక్, బల్క్ డ్రగ్స్, వ్యాక్సిన్లు, ఆరోగ్య రంగాల్లో ప్రముఖులు, బిజినెస్ లీడర్స్ అంతా ఇక్కడే ఉన్నారనీ, సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ), బయోటెక్ వంటి రంగాల సమ్మేళనంతో అసాధారణమైన ఫలితాలను సాధించవచ్చన్నారు.
హైదరాబాద్లో జరుగుతున్న బయోఏషియా సదస్సు దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వంటి అంతర్జాతీయ గుర్తింపును పొందుతుందనే విశ్వాసాన్ని ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా జీవవిజ్ఞాన రంగంపై ప్రభుత్వ ప్రత్యేక దృష్టి, తెలంగాణ రైజింగ్-2047 విజన్ గురించి వివరించారు. 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని స్పష్టంచేశారు. ప్రస్తుత జీవ విజ్ఞాన ధోరణులను గమనిస్తే పరిశోధనా సంస్థలు, కార్పొరేట్లు, స్టార్టప్లు, చిన్న మధ్య తరహా సంస్థలు, ప్రభుత్వం మధ్య బలమైన భాగస్వామ్యం అవసరమనే విషయం తెలుస్తున్నదని అన్నారు. దానికి కావల్సిన విశ్వసనీయ, స్థిరమైన భవిష్యత్ కోసం మంచి వాతావరణాన్ని కల్పిస్తూ బల్క్డ్రగ్స్ నుంచి బయాలజిక్స్ వరకు, ఆవిష్కరణల నుంచి తయారీ వరకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి కృతనిశ్చయంతో అందరికీ తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
రాష్ట్రాన్ని సమగ్ర జీవవిజ్ఞాన రంగానికి ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసిరావాలనీ, రాష్ట్రంలో విస్తారంగా పెట్టుబడులు పెట్టి, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ను స్థాపించాలని కోరారు. మాలిక్యూల్స్, ఔషధాల డిజైన్, క్లినికల్ అనలిటిక్స్తో పాటు డిజిటల్ తయారీ ఏఐ ప్లాట్ఫాంలను అభివృద్ధి చేసుకోవాలనీ, దానికి అవసరమైన సంపూర్ణ సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మాట్లాడుతూ ల్యాబొరేటరీ ఆఫ్ ది ఫ్యూచర్గా హైదరాబాద్ నిలుస్తుందని అన్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో 2030 నాటికి కొత్తగా 5 లక్షల మందికి ఉద్యోగావకాశాలు వస్తాయనీ. ప్రపంచంలోని టాప్ 3 లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో ఒకటిగా తెలంగాణను నిలిపేందుకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్తో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ బయోటెక్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.



