బీఆర్ఎస్కు 1
మూడింటి ఎన్నిక మళ్లీ వాయిదా
కోర్టు ఉత్తర్వులతో ఇబ్రహీంపట్నం ఫలితం నిలిపివేత
కోడ్ఆఫ్ కండక్ట్ను ఎత్తేసిన ఎన్నికల సంఘం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సోమవారం వాయిదా పడ్డ 11 మున్సిపాల్టీల పాలక మండళ్లకు మంగళవారం ఎన్నికలు నిర్వహించారు. వివిధ కారణాల వల్ల 3 స్థానాల్లో ఎన్నిక మళ్లీ వాయిదా పడింది. దాంతో 8 మున్సిపాల్టీల పాలక మండలిని సభ్యులు ఎన్నుకున్నారు. అందులో 7 కాంగ్రెస్కు దక్కగా, ఒకటి బీఆర్ఎస్ గెలుచుకుంది. ఇబ్రహీంపట్నం, క్యాతన్పల్లి, ఖానాపూర్ మున్సిపాల్టీల్లో ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. లక్కీ డ్రాలో తొర్రూర్ మున్సిపాల్టీని కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. మంగళవారం జరిగిన ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థులు తుణం శ్రవణ్ చైర్మెన్గా, సోమ రజినీ వైఎస్ చైర్మెన్గా ఎన్నికయ్యారు.
ఇల్లందులో దొడ్డ కిరణ్ మిత్ర, సుల్తానాబాద్లో అంతటి పుష్పలత, కాగజ్నగర్లో షాహిన్ సుల్తానా, జహీరాబాద్లో యూనస్, డోర్నకల్లో కొండేటి రాజకుమారి కాంగ్రెస్ నుంచి చైర్మెన్గా ఎన్నికయ్యారు. ఇంద్రేశం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి పి.హరీశ్రెడ్డి చైర్మెన్గా ఎన్నికయ్యారు. కాగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాల్టీ వివాదం హైకోర్ట్కు చేరింది. 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరిని ఎవరో కిడ్నాప్ చేశారని ఆయన కొడుకు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ను విచారించిన హైకోర్ట్ గురువారం తమ ముందు యాదగిరిని హాజరు పర్చాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే కోర్ట్ అర్డర్ అందక ముందే ఇబ్రహీంపట్నం చైర్మెన్ ఎన్నికను అధికారులు పూర్తి చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి సుదర్శన్రెడ్డి మున్సిపల్ చైర్మెన్గా ఎన్నికయ్యారు.
హైకోర్ట్ ఎన్నికపై స్టే విధించడంతో ఆయనకు అధికారులు ధ్రువీకరణ పత్రం ఇవ్వలేదు. సోమవారం 105, మంగళవారం మరో 8 పాలక మండళ్లకు జరిగిన ఎన్నికల్లో మొదటి రోజు 81, రెండో రోజు మరో 7తో కలిపి కాంగ్రెస్ అత్యధికంగా 88 మున్సిపాల్టీలను దక్కించుకుంది. బీఆర్స్కు మొదటి రోజు 18, రెండో రోజు ఒక దానితో కలిపి మొత్తం 19 మున్సిపాల్టీలు దక్కాయి. ఇంకా 3 మున్సిపాల్టీల ఫలితాలు తేలాల్సి ఉంది. కాగా వీటిని ఎప్పడు నిర్వహించేది ఎన్నికల కమిషన్ ప్రకటించలేదు. ఈ నెల 19న కొర్ట్ నిర్ణయం తర్వాత మిగిలిన మూడు మన్సిపాల్టీల పాలక మండళ్లకు ఎన్నిక నిర్వహించే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా 112 మున్సిపాల్టీలు, 7 కార్పొరేషన్ల పాలక మండళ్ల ఎన్నిక పూర్తి కావడంతో కోడ్ ఆఫ్ కండక్ట్ను ఎత్తి వేస్తున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.




