నవతెలంగాణ-ఆలేరు టౌన్
సగటు మానవునికి నీటి అవసరాలు పెరుగుతున్నాయి. దీంతో నీటి వినియోగం తారాస్థాయికి చేరింది. ఆలేరు పట్టణంలో ,మండలంలోని గ్రామాలలో అధికారుల నుండి ఎలాంటి అనుమాతలు పొందకుండా కొత్త బోర్లు విచ్చలవిడిగా వేస్తున్నారు. కొత్త బోర్ల తవ్వకంపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. వాల్టా(వాటర్ లాండ్ అండ్ ట్రీస్ యాక్టు) చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. కానీ అమలు చేయడంలో నిర్లక్ష్యం కనబడుతుంది. పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న జనాభా కనుగుణంగా నీటి వినియోగం తారాస్థాయికి చేరింది.
ఈ నేపథ్యంలో కొత్త బోర్ల తవ్వ కంపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. వాల్టా(వాటర్ లాండ్ అండ్ ట్రీస్ యాక్టు) చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. కానీ అమలు చేయడంలో కిందిస్థాయి అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొంతమంది అధి కారులు బోర్ల తవ్వకాలకు సహకరిస్తూ వాల్టాకు తూట్లు పొడుస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. పట్టణం మండలంలోని గ్రామాలలో ఇష్ట రాజ్యాంగ బోర్లు వేస్తుండడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయి పోతున్నాయి. రైతులు, ప్రజలు అనుమతి తీసుకోకుండా అప్పులు చేసి ఇష్టానుసారంగా బోర్ల తవ్వకాలు చేపడుతున్నారు.
పట్టణంలో బోర్లు వేస్తున్నామని ఎక్కడ కూడా అనుమతి తీసుకోకపోవడం గమనార్హం. అధికారులు కూడా చర్యలు తీసుకోవడం లేదు. ఎక్కడో పొలాల్లో వేస్తున్న బోర్ల గురించి తమకు సమాచారం ఉండటం లేదని దీంతో పరిశీలన చేయడం ఇబ్బందిగా మారిందని అధికారులు చెబుతున్నారు. బోరు తవ్వకం చేసే యజమానులు తప్పకుండా అనుమతి పొందాల్సిన అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు. పంట పొలాల్లో వేసే బోర్ల తవ్వకాలకు కచ్చితంగా అనుమతి తీసుకోవాలన్న నిబంధన ఉన్నా ఎక్కడా పాటించడం లేదు. ఒక బోరు తవ్వాలంటే ముందుగా సంబంధిత తహసీల్దార్ల వద్ద అనుమతి తీసుకోవాలి. బోరు తవ్వకం ప్రాం తంలో నీరుందో లేదో తెలుసుకోవడానికి భూగ ర్భజల శాఖ అధికారులను సంప్రదించాలి. ఈ రెండు శాఖల అధికారుల అనుమతి తీసుకున్న తర్వాత బోరు తవ్వాలి. బోరుకు మద్య 500మీటర్ల దూరం ఉండాలి. బోరు పడక పోతే రైతులు ఆర్థికంగా చితికి పోకూడదన్న ఉద్దేశ్యంతో ఈ నిబంధనలు విధించారు. కానీ దీన్ని యజమానులు పట్టించుకోవడం లేదు.
నియమాలు ఇలా..
భూగర్భజల శాఖ అనుమతి పొందాకే రిగ్ వినియో గించాలనే నిబంధన పెట్టారు. అనుమతి ఇస్తే ఫార్మ్-2 తహసీల్దార్ ద్వారా తీసుకెళ్లాల్సి ఉంటుంది. రెవెన్యూ సిబ్బంది గ్రామాలకు వెళ్లి పరిశీలిస్తారు. బోరు బోరుకు 500మీటర్లు ఉంటేనే తవ్వకానికి అనుమతి ఇస్తారు. ట్రాన్స్కో అధికారుల ద్వారా విద్యుత్తు సర్వీసు ఇవ్వడానికి నిరభ్యంతర ద్రువీకరణ పత్రం తీసుకోవాలి.
అనుమాతులు పొందిన తర్వాతే బోర్లు వేసుకోవాలి: తహసీల్దార్, వి ఆంజనేయులు
పంటపొలాలు, ఇండ్ల వద్ద బోర్లు వేయడానికి యజమానులు తప్పనిసరిగా సంబంధిత అధికారుల అనుమతులు పొందాలి. అనుమతులు లేకుండా బోర్ల తవ్వకాలు చేపడితే సంబంధిత వాహనాలను సీజ్ చేస్తాం. యజమానులపై చట్టరిత్యా చర్యలు తీసుకుంటాం. ఎక్కడ బోరు తవ్వకాలు చేపడతారో ముందుగా సమాచారం ఇవ్వాలి. ఆ తర్వాతే బోర్ల తవ్వకాలకు అనుమతులు ఇస్తాం.
వాల్టా చట్టం ప్రకారం అనుమతులు పొందాలి: మున్సిపల్ కమిషనర్ కే శ్రీనివాస్ రెడ్డి
పట్టణంలో బోర్లు వేసుకునే ఇంటి యజమానులు వాల్ట్రా చట్టం ప్రకారం అనుమతులు పొందిన తర్వాతనే నిబంధనల మేరకు బోర్లు వేసుకోవాలి. అనుమతులు పొందకుండా బోర్లు వేసినట్లయితే తగిన చర్యలు తీసుకుంటాం. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా బోర్లు వేసినట్లయితే అధికారులకు స్థానికులు సమాచారం అందించాలి.
వాల్టా చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాలి: పంతం కృష్ణ, మాజీ వార్డ్ మెంబర్
పట్టణంలో నీటి సమస్యలను తీర్చాలని, వాల్టా చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాలి. పట్టణంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా బోర్లు వేయడం వల్ల పక్కనే ఉన్న బోర్లు ఎండిపోతున్నాయి. అధికారులు స్పందించి వాల్టా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలి.



