Thursday, February 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబుద్ధుడు, అంబేద్కర్‌ మార్గంలో మా పాలన

బుద్ధుడు, అంబేద్కర్‌ మార్గంలో మా పాలన

- Advertisement -

వారి ఆలోచనలే సకల సమస్యలకు పరిష్కారం : ఉప ముఖ్యమంత్రి భట్టి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గౌతమ బుద్ధుడు, బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ దార్శనిక మార్గంలో ప్రజాప్రభుత్వం పరిపాలన కొనసాగుతున్నదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. వారి ఆలోచనల విధానమే సకల సమస్యలకు పరిష్కార మార్గమని అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్‌ సర్కిల్‌ అబేద్కర్‌ స్మృతివనం వద్ద విశ్వశాంతిని కాంక్షిస్తూ పాదయాత్ర చేస్తున్న థాయిలాండ్‌, భారతీయ బౌద్ధ సన్యాసులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖమంత్రి వివేక్‌ వెంకటస్వామి, బుద్ధవనం ప్రాజెక్ట్‌ ఓఎస్డీ మల్లేపల్లి లక్ష్మయ్య, రిటైర్డ్‌ ఐఏఎస్‌ కాకి మాధవరావు తదితరులు పాల్లొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ బుద్ధవనం గురించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని అన్నారు. అందులో భాగంగా నిధులు కేటాయించడమే కాకుండా ఓఎస్డీ మల్లేపల్లి లక్ష్మయ్యను నియమించి అన్ని కార్యక్రమాలనూ ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు.

నాగార్జున సాగర్‌ వద్ద ఉన్న బుద్ధవనం చాలా అద్భుతంగా ఉంటుందని వివరించారు. అక్కడకు వెళ్తే మానసిక ప్రశాంతత ఏర్పడుందని అన్నారు. బౌద్ధులకు అవసరమైన వాటిని ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. బుద్ధవనం ఒక అద్భుతమైన పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రమని చెప్పారు. బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ జీవిత చరిత్రను, వారి సందేశాలను, వారు చూపించిన మార్గాన్ని భవిష్యత్‌ తరాలకు తెలిపేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అంబేద్కర్‌ దేశానికి అందించిన రాజ్యాంగం, సామాజిక న్యాయం పట్ల వారికి ఉన్న నిబద్ధతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. థాయిలాండ్‌ నుంచి 70 మంది, మరో 30 మంది భారతీయ బౌద్ధ బిక్షువులు ఈనెల రెండున కర్నాటకలోని కల్బుర్గి నుంచి పాదయాత్రను మొదలు పెట్టారు. వచ్చేనెల ఒకటి నాటికి నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం ప్రాజెక్టు వరకు అది కొనసాగనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -