– హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి
– ఓటరు జాబితా సవరణలో అప్రమత్తంగా ఉండాలి
– విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఈ నెల 30న ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకానిలో నిర్వహించనున్న రైతు ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని, ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నందున అశ్వారావుపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో తరలిరావాలని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పిలుపునిచ్చారు.
శుక్రవారం అశ్వారావుపేటలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అశ్వారావుపేట నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన 48,838 మంది రైతులకు రూ.92 కోట్ల 77 లక్షల 50 వేల 912 రైతు భరోసా నిధులు అందనున్నాయని తెలిపారు. చింతకానిలో జరిగే రైతు ఆశీర్వాద సభలో ఈ నిధులను ముఖ్యమంత్రి విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
ప్రజాపాలన ప్రారంభమైన డిసెంబర్-2023 నుంచి ఇప్పటి వరకు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 160 అభివృద్ధి పనులకు రూ.11.20 కోట్ల నిధులు వెచ్చించి పూర్తి చేశామని చెప్పారు. అటవీ ప్రాంత గ్రామాల్లో విద్యుత్ సరఫరాను మెరుగుపర్చేందుకు తొమ్మిది విద్యుత్ ఉపకేంద్రాల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. కావడిగుండ్ల, తిరుమలకుంట, అశ్వారావుపేట, అచ్యుతాపురం, పార్కలగండి, మల్లారం, జగ్గారం, ఆసుపాక, రాజాపురం గ్రామాల్లో విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, అర్హులైన ఓటర్ల పేర్లు నమోదు చేసుకోవడంతో పాటు వివరాలను సరిచూసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ విలేకరుల సమావేశంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



