నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల పరిధిలోని గాంధీనగర్ గ్రామంలో తీవ్ర అనారోగ్యం, ఆర్థిక సమస్యలు, మద్య వ్యసనంతో మనస్తాపానికి గురై ముద్దంగుల అశోక్ (29) అనే వ్యక్తి ఆత్మహత్య పాల్పడ్డాడు. సంఘటనకు సంబంధించిన వివరాలను ఎస్ఐ సతీష్ వెల్లడించారు. గాంధీనగర్ గ్రామ నివాసి అయిన అశోక్ గత కొంతకాలంగా మూర్ఛ (ఫిట్స్) వ్యాధితో బాధపడుతున్నాడు. వివిధ ప్రాంతాల్లో వైద్యం చేయించినా నయం కాకపోవడంతో మానసిక వేదనకు గురై, మద్యానికి బానిసయ్యాడు.
గత రెండు నెలలుగా ఏ పని చేయకుండా, రోజంతా మద్యం తాగుతూ అనారోగ్యం మరింత తీవ్రం కావడంతో జీవితంపై విరక్తి చెందాడు. ఈ క్రమంలో శుక్రవారం కుటుంబ సభ్యులు బయట నిద్రిస్తున్న సమయంలో అశోక్ ఇంట్లోకి వెళ్ళి చీరతో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య సంధ్య లోపలికి వెళ్లి చూసేసరికి అశోక్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. వెంటనే కుటుంబసభ్యులు అతన్ని కిందకు దించినప్పటికీ అప్పటికే అతను మృతి చెందాడు. మృతుడి భార్య సంధ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించినట్లు తెలిపారు.



