అద్భుతమైన Temple Murals.. కొలనుపాక సోమేశ్వరాలయం మంటప ప్రవేశ ద్వారంలోపల డంగుసున్నం పూసిన ఎడమవైపు పైకప్పులో అద్భుతమైన వర్ణచిత్రాల అవశేషాలు చూడడం అపురూపం. గతంలో పిల్లలమర్రిలో, కోటగుళ్ళల్లో ఇటువంటి గుడిలో పైకప్పుకు రాతిదూలాలమీద వేసిన వర్ణచిత్రాలను చూసాం. రాచకొండ రామాలయంలో వర్ణచిత్రాల వార్తను చదివాం. గతంలో భువనగిరి బ్రాహ్మణవాడ శివాలయంలో వర్ణచిత్రాలుండేవని ఆదిరాజు వీరభద్రరావుగారు రాసారు. ఎన్ని దేవాలయాలలో ఎన్నెన్ని Temple Murals ఉండేవో, ఎన్ని కనిపించకుండా పోయాయో అనూహ్యం. దేవాలయాలలో మిగిలి ఉన్న ఈ వర్ణచిత్రాల సంస్కతిని నిలుపుకోవాలి. ఈ చిత్రాలను ‘కెమికల్ ట్రీట్ మెంట్’తో వారసత్వశాఖ కాపాడాలి.
కొలనుపాక సోమేశ్వరాలయం దేవాలయ మంటపం పైకప్పులో వేసివున్న ఈ రంగులచిత్రాలను కొత్త తెలంగాణ చరిత్రబృందం సభ్యుడు సిరిపురం నరేందర్ తొలుత గమనించాడు. చరిత్రబృందం సభ్యులు శ్రీరామోజు హరగోపాల్, ముల్లక్కల రవికుమార్, కుండె గణేశ్, మేఘరాజు ఈ చిత్రాలను పరిశీలించి, విశ్లేషించారు.
ఈ చిత్రాలు కథాకథనాత్మకాలవి. ఏదో ఒక యక్షగానంలోని కథాంశాన్ని చిత్రించారు. ఒకచోట ఊరేగింపు దృశ్యంలో ఊరేగిస్తున్నది విశ్వబ్రహ్మను, చిత్రం పైన ఆ పేరు తెలుగులో రాసివుంది. లిపి కాలాన్ని బట్టి 16,17వ శతాబ్దాల తెలుగురాతగా నిర్ధారించవచ్చు. ఈ చిత్రాలు అప్పటివేనని చరిత్రబృందం కన్వీనర్ హరగోపాల్ అన్నారు. చిత్రాలలో అక్కడక్కడ లేబుల్(నామ) వాచకాలు అగుపించాయి. వాటిలో ‘శరభ’, సంగరోలు’ వంటి పేర్లున్నాయి. ఇంకా ఈ చిత్రాలను కెమికల్ ట్రీట్మెంటు చేస్తే మరిన్ని పేర్లు, చిత్రాలు వెలుగుచూస్తాయని సభ్యులు అభిప్రాయపడ్డారు.
క్షేత్రపరిశోధన, ఫొటోగ్రఫీ: శ్రీరామోజు హరగోపాల్,
ముల్లక్కల రవికుమార్, కుండె గణేశ్, మేఘరాజు,
కొత్త తెలంగాణ చరిత్రబృందం, 9949498698
కనుగొంటిమి అందాల వర్ణచిత్రాలను
- Advertisement -
- Advertisement -



