వికలాంగుల పెన్షన్ రూ.6 వేలకు పెంచాలి
‘వీబీజీఆర్ఏఎంజీ’ ని రద్దు చేయాలి
లబ్దిదారులకు వెంటనే పరికరాలు పంపిణీ చేయాలి : ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం.అడివయ్య
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి 5 శాతం నిధులు కేటాయించాలని, పెన్షన్ రూ.6వేలకు పెంచి వెంటనే అమలు చేయాలని ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం.అడివయ్య డిమాండ్ చేశారు. బుధవారం బడ్జెట్లో వికలాంగులకు నిధులు పెంచాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ల ఎదుట ధర్నాలకు ఎన్పీఆర్డీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, అడిషనల్ కలెక్టర్ పాండుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా అడివయ్య మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి రూ.1669.72 కోట్లు మాత్రమే కేటాయించిందని అన్నారు.
నిధుల కేటాయింపులో కేంద్రం నిర్లక్ష్యం చేస్తున్నదని, 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి నిధుల కేటాయింపు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మార్చి 20వ తేదీన ప్రవేశపెట్టే బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. రెండేండ్ల నుంచి ప్రభుత్వం కేటాయించిన నిధులు విడుదల చేసి ఖర్చు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం ఉందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీల అమలు కోసం నిధులు ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. చేయూత పెన్షన్స్ పెంపు కోసం బడ్జెట్లో నిధులు కేటాయించి, పెన్షన్స్ పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 26 నెలలు పూర్తవుతున్నా పెన్షన్స్ పెంచడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు సహాయ పరికరాల పంపిణీ కోసం లబ్దిదారుల జాబితాలు తయారు అయినా ఎందుకు పరికరాలు పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు.
2024-25 ఆర్థిక సంవత్సరనికి చెందిన పరికరాలు పూర్తిస్థాయిలో పంపిణీ చేయకుండానే 2025-26 ఆర్థిక సంవత్సరానికి దరఖాస్తులు స్వీకరించడం సరైంది కాదన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టులను గుర్తించి వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. వీబీజీఆర్ఏఎంజీ రద్దు చేసి ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వికలాంగులపై దాడులు, దౌర్జన్యాలు, వేధింపులు పెరిగిపోతున్నాయని, వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్పీఆర్డీ సంగారెడ్డి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యం.బస్వరాజు పాటిల్, కొనింటి నర్సిములు, రాష్ట్ర కమిటీ సభ్యులు జయలక్ష్మి, పి.మేరీ, జిల్లా ఉపాధ్యక్షులు లలిత, రాంచందర్, వెంకన్న, రాములు, రాజ్ కుమార్, సహాయ కార్యదర్శులు కపవరం, కుమ్మరి నర్సిములు, నవీన్ చారి, శంకర్ నాయక్, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు



