ఎస్ఎఫ్ఐ రౌండ్టేబుల్ సమావేశం డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉన్నత విద్యా వ్యవస్థలో కుల వివక్ష, సామాజిక వెనుకబడిన వర్గాలపై జరుగుతున్న అన్యాయాలను అరికట్టేందుకు యూజీసీ రూపొందించిన కుల వ్యతిరేక సమానత్వపు మార్గదర్శకాలను దేశ వ్యాప్తంగా తక్షణమే అమలు చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. గురువారం హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.మమత అధ్యక్షతన వివిధ విద్యార్థి, అధ్యాపక, ప్రజాసంఘాల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం గౌరవాధ్యక్షులు జి.రాములు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీరామ్ నాయక్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి డాక్టర్ గ్యార నరేష్ , పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్ష్య, కార్యదర్శులు పి.మహేష్, పొడపంగి నాగరాజు, పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాకేష్, జార్జిరెడ్డి పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎస్.నాగేశ్వరరావు, ఏఐపీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు గోపాల్ , పీడీఎస్యూ విజృంభణ రాష్ట్ర సహాయ కార్యదర్శి పవన్ మాట్లాడారు.
సమావేశానికి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.కిరణ్ ఆహ్వానం పలికారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు అశోక్ రెడ్డి వందన సమర్పణ చేశారు.ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కులను ఉన్నత విద్యాసంస్థలు అమలు చేయకపోవడం తీవ్ర ఆందోళనకరమని అభ్యంతరం వ్యక్తంచేశారు. క్యాంపస్లలో కుల దురహంకారం, సున్నితమైన వేధింపులు, స్కాలర్షిప్లలో వివక్ష, గైడ్ల కేటాయింపుల్లో అసమానతలు వంటి సమస్యలు పెరుగుతున్నాయని వారు విమర్శించారు. యూజీసీ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ప్రతి విశ్వవిద్యాలయంలో ”సమానత్వ సెల్”, ”ఆంటి-డిస్క్రిమినేషన్ ఆఫీసర్”, పారదర్శక ఫిర్యాదు పరిష్కారవ్యవస్థ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు వ్యవస్థను అదే యూనివర్శీటీల నుంచి కాకుండా స్వతంత్ర వ్యవస్థ ఏర్పాటు చేయాలని సమావేశం డిమాండ్ చేసింది.
ఈ చర్యలు సుప్రీంకోర్టు తీర్పు సామాజిక న్యాయం పై దాడి అని విమర్శించారు. కులవివక్ష అనేది వ్యక్తిగత సమస్యకాదు. అది నిర్మాణాత్మక సామాజిక అన్యాయం. విద్యా సంస్థలు జ్ఞానం పంచే కేంద్రాలు మాత్రమే కాకుండా, సమానత్వ విలువలను ఆచరణలో చూపే స్థలాలుగా ఉండాలి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ ఆకాంక్షించిన సామాజిక న్యాయం విద్యాసంస్థల్లోనే ప్రారంభం కావాలని కోరారు. అన్ని కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో యూజీసీ కులవ్యతిరేక సమానత్వ మార్గదర్శకాల తక్షణ అమలు చేయాలి. స్వతంత్ర పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేసి ఆచరణను పర్యవేక్షిం చాలి.. బాధిత విద్యార్థులకు చట్టపరమైన, మానసిక సహాయ వ్యవస్థ ఏర్పాటు.
క్యాంపస్లలో కుల వివక్ష పై అవగాహన కార్యక్రమాలు, తప్పనిసరి శిక్షణ శిబిరాలు నిర్వహించాలి. ఫిర్యాదులపై నిర్దిష్ట కాలపరిమితిలో విచారణ పూర్తి చేసి నివేదికలు ప్రజలకు అందుబాటులో ఉంచడం సూచనలతో పాటు కుల వ్యతిరేక సమానత్వపు మార్గదర్శకాలు అమలు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. విద్యాసంస్థలు సమానత్వాన్ని అమలు చేయకపోతే, విద్యార్థి ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.రౌండ్టేబుల్ సమావేశంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు కార్తీక్, జునుగరి రమేష్, లెనిన్, జార్జిరెడ్డి పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి ఎన్.సుమంత్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు శ్రీమాన్, భగత్, శ్యామ్, ప్రవీణ్, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.



