కంసానిపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో సమస్యలపై సర్వే అధ్యయనం
నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలం కంసానిపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం సర్వే అధ్యయనం నిర్వహించినట్లు ఎస్ఎఫ్ఐ మండల నాయకుడు చింతల నాగరాజు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమై చాలారోజులు గడిచినా విద్యార్థులకు ఇప్పటికీ యూనిఫాంలు పూర్తిస్థాయిలో అందలేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించే కార్యక్రమాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు. పాఠశాలలో పీటీ టీచర్ లేకపోవడంతో విద్యార్థులు క్రీడా శిక్షణకు దూరమవుతున్నారని, ఖాళీ పోస్టును వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే విద్యార్థులకు సరిపడా పాఠ్యపుస్తకాలు అందలేదని, మరుగుదొడ్లు తగిన సంఖ్యలో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పాఠశాల వెనుక భాగంలో చెత్తాచెదారం పేరుకుపోయి అపరిశుభ్ర వాతావరణం నెలకొన్నందున వెంటనే శుభ్రపరిచే చర్యలు చేపట్టాలని కోరారు. పాఠశాల స్వీపర్కు కేవలం రూ.3,000 మాత్రమే వేతనం చెల్లించడం అన్యాయమని, వేతనాన్ని పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సర్వే కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ స్కూల్ అధ్యక్షుడు అరవింద్, కార్యదర్శి ఆకాష్, ఉపాధ్యక్షుడు సిద్దు, సహాయ కార్యదర్శి శివకుమార్, భరత్, కమిటీ సభ్యులు జాహ్నవి, నందిని భాయ్, కృష్ణవేణి, రమ్యశ్రీతో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.



