సాధారణంగా ఏదీ ఎవరికి పట్టదు. పెద్దలు చెప్పినా, అనుభవంతో సెలవిచ్చినా, తేలికగా తీసుకుంటారు. ఇప్పుడు మనదేశంలో జరుగుతున్న పరిణామాల పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుందని చెబుతున్న మంచిమాటలు ఎవరైనా వింటున్నారా! అబ్బే! అసలు పట్టింపేలేదు. ఎవరి ప్రయోజనాలు వాళ్లేకానీ మొత్తంగా వ్యవస్థకు జరిగే హాని గురించి మాట్లాడనే మాట్లాడరు. పిల్లలు, యువత కూడా అంతే! అందుకనే పెద్దలు ఈ సామెతను చెప్పి ఉంటారు. ‘ఏదయినా తనదాకా వస్తేకానీ, తెలియదని’ ఇది నూటికి నూరుపాళ్లు నిజం. దేశంలో అనేకానేక అసంబద్ధ, అబద్ధ ప్రచారాలు, వక్రీకరణలు జరుగుతున్నాయి. కొత్తగా ఎవరి ఇష్టమొచ్చినట్లు వాళ్లు కథనాలు ప్రచారంలో పెడుతున్నారు. అందులో వారి రాజకీయ, ఆర్థిక, ప్రయోజనాలు దాగుంటున్నాయి తప్ప, వాస్తవాలు కనిపించటం లేదు. ఇవి తప్పని చెబుతున్న పెద్దల గొంతు బలహీనంగా ఉంటున్నది. ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆ కథనాలే చరిత్ర వాస్తవాలుగా రేపు చలామణి అవుతాయి. ఇప్పుడు కూడా నమ్మేజనం ఉన్నారు. మొన్న కోవా బన్ను వలీపై వచ్చిన చర్చ ఎంత వక్రీకరణకు దారితీసిందో తెలుసు. బన్నుపై ఉమ్మి అమ్ముతారని, ఆ బన్నువల్ల సంతానలేమి కలుగుతుందని ఇంకా ఎన్నెన్నో విద్వేషాలను ప్రచారం చేశారు. ఇలాంటిదే ఇప్పుడు చరిత్ర పట్లా, రాజకీయ పరిణామాల పట్లా, సామాజిక విషయాల పట్లా, వక్రీకరణ ప్రచారాలు విరివిగా జరుగుతున్నాయి. అదీ అధికారమే చేస్తున్న ప్రచారం. మనకెందుకులే అని ఊరుకుంటున్న వాళ్లు చాలామంది ఉన్నారు. దీనివల్ల భవితకు తీవ్రనష్టం జరుగుతుంది.
నేడు ప్రధానంగా మహాత్మాగాంధీ, నెహ్రూలపై తీవ్రమైన దుష్ప్రచారం జరుగుతున్నది. ఒకటి రాజకీయమైనదైతే, రెండోది అతిదారుణంగా వ్యక్తిగత నైతిక విషయాలకు ప్రవర్తనాలకు సంబంధించింది. రెండూ పూర్తి అసత్యాలతో కూడుకున్నవి. రాజకీయ, పరిపాలనపరమైన విమర్శ వేరు. కానీ కావాలని పనిగట్టుకుని అబద్దాలను ప్రచారం చేయటం అనేది బీజేపీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్నది. మహాత్మున్ని హిందూ వ్యతిరేకిగా చిత్రించడం, అతన్ని హతమార్చడం సరైన చర్యగానే సమర్థించడం, చంపిన గాడ్సేను పొగడటం, అతనికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేయడం వంటివి చాలా వికృతమైన ప్రచారాలు. సోషలిస్టు రష్యా ప్రభావంతో పంచవర్ష ప్రణాళికలను, ప్రభుత్వ సంస్థలను నెలకొల్పి అమలు పరచిన నెహ్రూను, దేశం వెనకబడటానికి ఆయనే కారణమని, విలాసలోబడని ప్రచారం చేస్తున్నారు. ఆనాడు నెలకొల్పిన సంస్థలన్నింటినీ ప్రయివేటుపరం చేస్తూ, మూసేస్తూ ఈ ప్రచారం చేయటం హోరమైన విషయం. ఇక చరిత్రలోంచి మొగలుల పరిపాలనా భాగాలను తీసేయటం, గాంధీని తీసేయటం, అంతేకాదు, పాఠాల నుండి జీవ పరిణామక్రమ సిద్ధాంతాన్నే తీసేయటం ఎంత దుర్భుద్ధితో కూడుకున్న చర్య. అంతేకాదు గుళ్లు కూలగొట్టింది ముస్లిం పాలకులే అన్న అబద్ధాన్నీ ప్రచారం చేస్తున్నారు. హిందూరాజులు కూడా గుళ్లు కూలగొట్టారనే సత్యాన్ని కప్పిపెడుతున్నారు. దేశంలో గోమాంసం విదేశాలకు సరఫరా చేస్తున్న సంస్థలు హిందువులయితే, గోమాంసం కలిగి ఉన్నారనే నెపంతో ముస్లింలను కొట్టి చంపుతున్నారు. ఇలా సమస్తమూ అసంబద్ధంగా కొనసాగుతున్నది.
ఇవ్వన్నింటినీ అడ్డుకోవాల్సింది ప్రజాఉద్యమాలు, మేధావులు, ఈ దేశపు న్యాయవ్యవస్థ కూడా. న్యాయవ్యవస్థయినా స్వతంత్రంగా వ్యవహరిస్తే ప్రజలకు కొంతమేలు జరగవచ్చు. కానీ, అది నామమాత్రమే అని చెప్పాలి. ‘దేశంలో కార్మికసంఘాలు సమ్మెలతో దేశాభివృద్ధిని అడ్డుకుంటున్నాయి’ అని సుప్రీంకోర్టు ఇటీవలే అసంబద్ధంగా వ్యాఖ్యానించింది. ఇది దేశ కార్మికవర్గాన్ని నివ్వెరపాటుకు గురిచేసింది. ఈ మధ్య ఎన్సిఈఆర్టి 8వ తరగతి పాఠ్యపుస్తకంలో న్యాయ వ్యవస్థలో అనేక విభాగాలలో అవినీతి ఉన్నదని పాఠ్యాంశంగా చేర్చిన విషయం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి వచ్చింది. ఇది కుట్రపూరితదాడి అని, ఎవరైనా సంస్థలను బదనామ్ చేస్తే కోర్టులు ఊరుకోవని, వెంటనే ఆ పాఠ్యాంశాన్ని తొలగించాలని ఆదేశించారు. సుమోటోగా కేసును స్వీకరించారు. ఒక్క న్యాయవ్యవస్థే కాదు, రాజకీయాలలోని అవినీతి మాటేమిటి? మంత్రుల, ఉద్యోగుల, దర్యాప్తు సంస్థలలో కొనసాగుతున్న అవినీతి సంగతేమిటని, న్యాయకోవిధులు ప్రశ్నలు సంధి స్తున్నారు. నిజమేమరి. ఇదే సందర్భంలో నోట్లకట్టలతో దొరికిన న్యాయమూర్తి ఉదంతాన్ని విస్మరించలేము. అవినీతి అనేది ఈ వ్యవస్థలో అన్నింటిలోనూ కొనసాగుతుందనేది మాత్రం వాస్తవం. కానీ, మొత్తం సంస్థలకు అవమానపరచడం సరికాదు. అయితే ఏదయినా తనదాకావస్తేకానీ… స్పందన సరిగా ఉండదనేది అర్థమయ్యే విషయం.
తనదాకావస్తేకానీ…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


