అరంగేట్రానికి సూర్యవంశీ సై రెండో టీ20తో ఎంట్రీకి అవకాశం
భారత క్రికెట్ యువ సంచలనం, ఈ ఏడాది ఐపీఎల్ మొనగాడు వైభవ్ సూర్యవంశీకి భారత తుది జట్టులో
కల్పించాలనే డిమాండ్, చర్చ రోజురోజుకు తీవ్రతరం అవుతోంది. అటు ఐపీఎల్లో ప్రపంచ మేటీ బౌలర్లను ఉతికారేసి, ఇటు భారత్-ఏ తరఫున ముక్కోణపు వన్డే సిరీస్ ఫైనల్లో 29 బంతుల్లోనే 94 పరుగులు పిండుకుని సత్తా చాటిన వైభవ్ సూర్యవంశీ భారత్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్లో చర్చనీయాంశంగా మారాడు. పసికూన ఐర్లాండ్, అగ్రజట్టు ఇంగ్లాండ్పై టాప్ ఆర్డర్ వైఫల్యం సుస్పష్టం. ఓపెనర్గా సంజు శాంసన్, నం.3 బ్యాటర్గా ఇషాన్ కిషన్ నిరాశపరిచారు. అభిషేక్ శర్మ ఒక్కడే నిలకడగా రాణించాడు. సంజు శాంసన్ (1), ఇసాన్ కిషన్ (0) వైఫల్యంతో చెస్టర్ లె స్ర్టీట్ టీ20లోనూ భారత్ 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుంది. దీంతో టాప్ ఆర్డర్లో వైభవ్ సూర్యవంశీ ఆడాలనే డిమాండ్కు మద్దతు పెరుగుతోంది. సంజు శాంసన్, ఇషాన్ కిషన్లలో ఎవరిపై వేటు వేసినా ఫర్వాలేదు, వైభవ్కు అవకాశం ఇవ్వాలనే వాదన బలపడుతోంది. జట్టు మేనేజ్మెంట్ సైతం ఇక వైభవ్ సూర్యవంశీని బెంచ్కు పరిమితం చేయలేని పరిస్థితులు వచ్చేశాయి. భారత్, ఇంగ్లాండ్ రెండో టీ20 శనివారం మాంచెస్టర్లో జరుగనుంది.
సరైన తరుణమిదే
ఓపెనర్ సంజు శాంసన్ గత మూడు ఇన్నింగ్స్ల్లో వరుసగా 5, 0, 1 పరుగులు చేశాడు. నం.3 బ్యాటర్ ఇషాన్ కిషన్ సైతం వరుసగా 1, 12, 0 పరుగులే రాబట్టాడు. టాప్ ఆర్డర్లో ఈ ఇద్దరూ తేలిపోవటంతో ఐర్లాండ్తో సిరీస్లో, ఇంగ్లాండ్తో తొలి టీ20లో భారత్ ఇరకాటంలో పడింది. బెంచ్పై విధ్వంసక ఆటగాడు ఉండగా, పేలవ ఫామ్తో ఉన్న ఇద్దరు సీనియర్లను తుది జట్టులో కొనసాగించటంపై విమర్శలు వస్తున్నాయి. అతి శీతల వాతావరణ పరిస్థితులు ఉండే గ్రేట్ బ్రిటన్లో పిచ్లు స్వింగ్, అదనపు బౌన్స్కు అనుకూలిస్తాయి. టెస్టు క్రికెట్ తరహాలో కొత్త బంతిని ఎదుర్కొనేందుకు శాంసన్, కిషన్లు ఇబ్బంది పడుతున్నారు. అభిషేక్ శర్మ సహజశైలిలో ధనాధన్ క్రికెట్ ఆడుతున్నా.. టాప్-3లో అతడికి సహకారం అందించే ఆటగాడు కరువయ్యాడు. వైభవ్ సూర్యవంశీ జతకలిస్తే భారత టాప్ ఆర్డర్ మరింత దుర్బేద్యం కానుంది. అందుకే, రెండో టీ20లో వైభవ్ సూర్యవంశీ ఆడాలనే డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది.
కచ్చితంగా ఆడాలి: గవాస్కర్
టీ20 ప్రపంచకప్లోనూ సంజు శాంసన్ ఆరంభంలో అవకాశాలను వృథా చేసుకున్నాడు. ఇటీవల ఐపీఎల్లోనూ ఆరంభంలో నిరాశపరిచాడు. కానీ, ఆ తర్వాత వరుసగా మ్యాచ్ను మలుపుతిప్పే ఇన్నింగ్స్లతో కదం తొక్కాడు. సంజు శాంసన్ ప్రతిభావంతుడే, అయినా ప్రతిసారీ రెండో అవకాశం దక్కటం కష్టమే. వైభవ్ సూర్యవంశీ రూపంలో చిచ్చరపిడుగు అవకాశం కోసం ఎదురుచూస్తుండగా, ఒక్క మ్యాచ్లో విఫలమైనా జట్టులో స్థానం ప్రశ్నార్థకంగా మారుతుంది. అటువంటిది, సంజు శాంసన్ వరుసగా మూడు మ్యాచ్ల్లో తేలిపోయాడు. ఇషాన్ కిషన్కు సైతం ఇదే సూత్రం వర్తిస్తుంది. అందుకే, ఇంగ్లాండ్తో టీ20లో వైభవ్ సూర్యవంశీ కచ్చితంగా ఆడాలని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నారు. ‘ఫామ్లో లేని క్రికెటర్లను జట్టు నుంచి తొలగించి, వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలి. ఇందులో ఎటువంటి సందేహానికి తావులేదు. సూర్యవంశీని ఓపెనర్గా బరిలోకి దింపుతారా? లేదంటే నం.3 స్థానంలో ఆడిస్తారా? అనేది అనవసరం. కానీ, ఇంగ్లాండ్తో సిరీస్లో వైభవ్ సూర్యవంశీ కచ్చితంగా ఆడాలి’ అని సునీల్ గవాస్కర్ అన్నారు.
తొలి టీ20 వర్షార్పణం
భారత్, ఇంగ్లాండ్ తొలి టీతొలి టీ20 వర్షార్పణం20 వర్షంతో రద్దుగా ముగిసింది. చిరుజల్లులు అంతరాయం కలించినా భారత్ తొలి ఇన్నింగ్స్లో 20 ఓవర్లలో 7 వికెట్లకు 189 పరుగులు చేసింది. ఆరంభంలో అభిషేక్ శర్మ (59, 24 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లు) 24 బంతుల్లో అర్థ సెంచరీతో చెలరేగగా, మిడిల్ ఓవర్లలో శ్రేయస్ అయ్యర్ (68, 47 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) కెప్టెన్సీ ఇన్నింగ్స్తో మెరువగా, చివర్లో శివమ్ దూబె (42 నాటౌట్, 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లు) దంచికొట్టాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో సకిబ్ మహమూద్ (3/33) రాణించాడు. వర్షంతో ఇంగ్లాండ్ ఛేదన ఆరంభమే కాలేదు. దీంతో తొలి టీ20 రద్దుగా ముగిసింది. రెండో టీ20 శనివారం మాంచెస్టర్లో జరుగనుంది.



