– చిన్నారులకు పోషకాహార అల్పాహారం ప్రారంభం
నవతెలంగాణ – అశ్వారావుపేట : ఐసీడీఎస్ అశ్వారావుపేట ప్రాజెక్టు పరిధిలోని చిన్నంశెట్టి బజార్ అంగన్వాడీ కేంద్రంలో ‘ఆరోగ్య లక్ష్మీ పథకం – తొలిముద్ద ఆరోగ్యానికి బాట’ కార్యక్రమాన్ని శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మూడు నుంచి ఆరు సంవత్సరాల వయస్సు గల చిన్నారులకు అంగన్వాడీ కేంద్రంలో అల్పాహారంగా కిచిడి మిశ్రమం, ఉప్మా మిశ్రమం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కార్యక్రమంలో సీడీపీఓ ముత్తమ్మ, నాలుగో వార్డు కౌన్సిలర్ కట్ట సింధుజ, సూపర్వైజర్లు జాఫియా, వరలక్ష్మి, పోషణ్ అభియాన్ కోఆర్డినేటర్ శ్రీకాంత్, చిన్నారుల తల్లులు, గ్రామస్తులు, పిల్లలు పాల్గొన్నారు.
అధికారులు మాట్లాడుతూ, ప్రతి నెల 30 రోజులపాటు చిన్నారులకు అల్పాహారం అందజేయనున్నట్లు తెలిపారు. ఇందులో 15 రోజులపాటు కిచిడి మిశ్రమం, మరో 15 రోజులపాటు ఉప్మా మిశ్రమాన్ని ఉదయం 9:30 గంటలలోపు మూడు నుంచి ఆరు సంవత్సరాల వయస్సు గల పిల్లలకు అందించాలని అంగన్వాడీ టీచర్లకు సూచించారు.
అలాగే అర్హులైన లబ్ధిదారులు ఈ పోషకాహార కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని చిన్నారుల ఆరోగ్యాభివృద్ధికి తోడ్పడాలని అధికారులు పిలుపునిచ్చారు.



