నవతెలంగాణ-ఆలేరు టౌన్ : జిల్లాలోని బీబీనగర్లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో జర్నలిస్టుల కోసం ప్రత్యేక హెల్త్ వెల్నెస్ సెంటర్ను ఏర్పాటు చేయాలని,తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు, మహమ్మద్ షానూర్ డిమాండ్ చేశారు.
ఆలేరు పట్టణంలో శుక్రవారం ఆ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా పనిచేస్తూ నిత్యం ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే జర్నలిస్టులు అనేక ఒత్తిడులు, ప్రతికూల పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నారని, ప్రజా సేవలో నిమగ్నమయ్యే జర్నలిస్టుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు అవసరమని సూచించారు.
జర్నలిస్టులకు ఆరోగ్య సమస్యలు తలెత్తిన సమయంలో సరైన వైద్య సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.వైద్య సేవలు, క్రమానుగత ఆరోగ్య పరీక్షలు, వైద్య సదుపాయాలు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసడెంట్ నరేష్, మండల అధ్యక్షులు సిద్దులు పాల్గొన్నారు.



