నవతెలంగాణ – హైదరాబాద్ : సౌదీ అరేబియా రాజధాని రియాద్లో తీవ్ర కలకలం రేగింది. ఇక్కడి అమెరికా రాయబార కార్యాలయంపై రెండు డ్రోన్లతో దాడి జరిగింది. ఈ దాడిని సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.
సౌదీ రక్షణ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం రెండు డ్రోన్లు ఎంబసీ భవనాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ దాడి కారణంగా భవనంలో స్వల్పంగా మంటలు చెలరేగాయని, పాక్షికంగా ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. దాడి జరిగిన సమయంలో భవనం ఖాళీగా ఉండటంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ప్రాథమిక సమాచారం. దాడికి ముందు డిప్లొమాటిక్ క్వార్టర్ ప్రాంతంలో పెద్ద పేలుడు శబ్దం వినిపించిందని, ఆ తర్వాత దట్టమైన నల్లటి పొగలు కమ్ముకున్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఈ పరిణామంపై సౌదీలోని అమెరికా మిషన్ వెంటనే స్పందించింది. రియాద్, జెడ్డా, దహ్రాన్ నగరాల్లో నివసిస్తున్న తమ పౌరుల కోసం “షెల్టర్ ఇన్ ప్లేస్” హెచ్చరికను జారీ చేసింది. ప్రజలందరూ వెంటనే సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని, అనవసర ప్రయాణాలు చేయవద్దని సూచించింది. ఇటీవల ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ క్రమంలోనే ఈ దాడి జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ఈ దాడికి తామే బాధ్యులమని ఇప్పటివరకు ఏ సంస్థా అధికారికంగా ప్రకటించలేదు.



