Saturday, March 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబాధిత కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం చెల్లించాలి

బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం చెల్లించాలి

- Advertisement -

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అబ్బాస్‌
టోలిచౌకీలో ప్రమాద ఘటనాస్థలం సందర్శన
నవతెలంగాణ-మెహిదీపట్నం

హైదరాబాద్‌ టోలిచౌకీలో భవన నిర్మాణ ప్రమాదంలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి రూ.25 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని, సంబంధిత మున్సిపల్‌ అధికారులపై చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అబ్బాస్‌ డిమాండ్‌ చేశారు. టోలిచౌకీలోని ఆల్‌ హస్నాత్‌ కాలనీలో ప్రమాద ఘటనా స్థలాన్ని ఆయన సీపీఐ(ఎం) స్థానిక నాయకులతో కలిసి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భవన నిర్మాణదారుడు జీ ప్లస్‌ టూకు అనుమతి తీసుకుని ఏడంతస్తులు కడుతూ ఉంటే టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. ఏదైనా భవనం నిర్మాణం చేసేటప్పుడు బిల్డింగ్‌ యాజమానులు సరైన అనుమతులు తీసుకుని, కార్మికులకు కావలసిన సేఫ్టీ పరికరాలు ఇవ్వాలని, బిల్డింగ్‌ చుట్టూ ప్లాస్టిక్‌ జాలీలు కట్టి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడిన బిల్డర్‌ను వెంటనే అరెస్టు చేసి అతనిపై హత్యా నేరం కింద కేసు పెట్టాలని డిమాండ్‌ చేశారు. టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు అక్రమ నిర్మాణాలకు సహకరిస్తూ అంతస్తుకు లక్షల రూపాయలు చొప్పున అక్రమంగా వసూలు చేస్తున్నారని తెలిపారు. టోలిచౌకీలో ఎక్కడ చూసినా అనుమతులు లేని నిర్మాణాలే కనిపిస్తున్నాయని, అధికారులు మామూళ్ల మత్తులో మునిగిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలు ఎక్కడైనా చిన్న గుడిసె వేసుకుంటే వెంటనే వెళ్లి కూల్చేసే మున్సిపల్‌ అధికారులకు ఇలాంటి పెద్ద పెద్ద అక్రమ నిర్మాణాలు ఎందుకు కనిపించవని ప్రశ్నించారు. ఈ ప్రమాదానికి బాధ్యులైన టౌన్‌ అధికారులపై చర్యలు తీసుకునే వరకు సీపీఐ(ఎం) పోరాడుతుందని తెలిపారు. బాధిత కార్మికుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకూ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఆయనతో పాటు పార్టీ జిల్లా నాయకులు విఠల్‌, మీనా, కోటయ్య, నరసింహులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -