Sunday, March 8, 2026
E-PAPER
Homeజాతీయంఅంతరాల భారతం

అంతరాల భారతం

- Advertisement -

దేశంలో 308కి చేరిన అపరకుబేరులు
గతేడాది కొత్తగా 57 మంది నమోదు
హురున్‌ గ్లోబల్‌ లిస్ట్‌ 2026 వెల్లడి

న్యూఢిల్లీ : దేశంలో అధిక ధరలతో ప్రజల ఆదాయాలు సన్నగిల్లుతోంటే.. మరోవైపు కుబేరుల సంఖ్య భారీగా పెరుగుతోంది. హురున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌ 2026 నివేదిక ప్రకారం.. భారత్‌ ఇప్పుడు 308 మంది బిలియనీర్లతో ప్రపంచంలోనే మూడవ ర్యాంక్‌లో నిలిచింది. గడిచిన ఏడాదిలో భారత్‌లో 57 మంది కొత్త బిలియనీర్లు పుట్టుకొచ్చారు. మొత్తం 308 అపర కుబేరుల సగటు సంపద సుమారు రూ.36,570 కోట్లుగా నమోదయ్యింది. వీరందరి మొత్తం సంపద 10 శాతం పెరిగి రూ.112.6 లక్షల కోట్లకు చేరింది. ఇందులో 199 మంది సంపద పెరగ్గా, 109 మంది సంపదలో మార్పు లేకుండా ఉంది. భారతీయ బిలియనీర్లలో 7 శాతం మంది మహిళలు ఉన్నారు. ఇక హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ఛైర్‌పర్సన్‌ రోష్ని నాడార్‌ మల్హోత్రా రూ.3.2 లక్షల కోట్లతో మూడవ స్థానంలో నిలవడమే కాకుండా.. టాప్‌ 10 జాబితాలో ఉన్న ఏకైక మహిళగా గుర్తింపు పొందారు. రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ రూ.9.8 లక్షల కోట్ల సంపదతో ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా ఉన్నారు. గౌతమ్‌ అదానీ రూ.7.5 లక్షల కోట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. హెల్త్‌కేర్‌ రంగంలో అత్యధికంగా 53 మంది కొత్త బిలియనీర్లు నమోదయ్యారు. ఇంధన రంగంలో కేవలం 8 మంది బిలియనీర్లు ఉన్నప్పటికీ, అత్యధికంగా రూ.18.3 ట్రిలియన్ల సంపదను ఈ రంగం కలిగి ఉంది. 95 మంది బిలియనీర్లతో ముంబయి భారత్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

వెక్కిరిస్తున్న పేదరికం
హెల్త్‌కేర్‌, ఎనర్జీ వంటి కీలక రంగాలు ఈ అపర కుబేరులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. మరోవైపు క్షేత్రస్థాయిలో సామాన్యుడి పరిస్థితి మాత్రం దయనీయంగా మారుతోంది. బిలియనీర్ల సంపద 10 శాతం పెరిగినప్పటికీ.. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం సామాన్యుడి కొనుగోలు శక్తిని హరిస్తున్నాయి. ముఖ్యంగా హెల్త్‌కేర్‌, ఆటో విడిభాగాలు, ఎనర్జీ రంగాల్లో కొత్త కుబేరులు పుట్టుకొస్తున్న తరుణంలోనే అదే ఆరోగ్య సేవలు సామాన్యుడికి అత్యంత ఖరీదైనవిగా మారుతుండటం గమనార్హం. కేవలం ముంబయి వంటి మెట్రో నగరాలు సంపదకు కేంద్రాలుగా మారుతుండగా, గ్రామీణ భారతం ఇప్పటికీ కనీస మౌలిక సదుపాయాల కోసం పోరాటం చేస్తూనే ఉంది. బిలియనీర్ల సంఖ్య పెరగడం మున్ముందు రాబోయే ఆర్థిక అసమానతలకు హెచ్చరికలా అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేవలం 308 మంది కుబేరులు ఉండటం కన్నా, కోట్లాది మంది పేదరికం నుంచి బయటపడటమే నిజమైన అభివృద్ధి అని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -