– హుస్నాబాద్ 5 కె రన్ లో పాల్గొన్న మంత్రి పొన్నం
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం హుస్నాబాద్ పట్టణంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘ ఆధ్వర్యంలో 5కే రన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పట్టణాల్లో ఉన్న చెత్తా చెదారాన్ని తొలగించడమన్నారు. 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో హుస్నాబాద్ పట్టణ పౌరులు ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పట్టణంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని, విద్యార్థిని విద్యార్థులు అందరూ అన్ని రంగాలలో ముందుండాలని అన్నారు. అనంతరం ప్రజా పాలన థీమ్ తో 5కే రన్ , సెల్ఫీ పాయింటు ను ఏర్పాటు చేశారు.5కే రన్ లో గెలుపొందిన వారికి బహుమతుల ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి, కమిషనర్ టీ మల్లికార్జున్ , వైస్ చైర్పర్సన్ చిత్తారి పద్మ , మార్కెట్ చైర్మన్ తిరుపతిరెడ్డి, వైస్ చైర్మన్ బంక చందు, సింగిల్ విండో మాజీ చైర్మన్ బొలిశెట్టి శివయ్య, కౌన్సిలర్స్, ప్రజా ప్రతినిధులు, రన్నర్స్ అసోసియేషన్ సభ్యులు, స్కూల్ విద్యార్థులు, అధికారులు మరియు పట్టణ ప్రజలు పాల్గొన్నారు.



