Tuesday, March 10, 2026
E-PAPER
Homeతాజా వార్తలుభారీగా బడ్జెట్‌ పద్దు

భారీగా బడ్జెట్‌ పద్దు

- Advertisement -

ఈసారి రూ.3.15 లక్షల కోట్లు?
ప్రభుత్వం ప్రతిపాదించే అవకాశం
తెలంగాణ రైజింగ్‌కు అనుగుణంగా ఆర్థిక శాఖ కసరత్తు
ఆదాయం పెంచడమే లక్ష్యంగా సర్కారు ప్రణాళిక
అమలు కానీ హామీలపై ప్రత్యేక దృష్టి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ పద్దుపై కసరత్తు ప్రారంభించింది. అన్ని తరగతుల సంక్షేమం, అభివృద్ధి ఉండేలా పద్దులను కేటాయించే దిశగా సమాలోచన చేస్తున్నది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేటాయింపులు చేసే అవకాశమున్నది. ముఖ్యంగా ఆరు గ్యారంటీల అమలుకు అధిక ప్రాధాన్యత ఇవ్వబోతున్నది. ఇప్పటికే కొన్ని పథకాలను అమలు చేస్తున్నది. అమలు కాని హామీల కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. వాటి అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించినట్టు సమాచారం. ఈనెల 16 నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కాబో తున్నాయి. మొదటి రోజు ఉభయసభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తారు. 20న రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) బడ్జెట్‌కు సంబంధించి భారీగా పద్దును కేటాయించే అవకాశమున్నది. ఈసారి రాష్ట్ర బడ్జెట్‌ రూ.3.15 లక్షల కోట్లు ప్రతిపాదించాలని భావిస్తున్నది. గతేడాది డిసెంబర్‌లో తెలంగాణ రైజింగ్‌-2047 గ్లోబల్‌ సమ్మిట్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ప్రపంచ దేశాల ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల నిపుణులను ఆహ్వానించింది. అయితే 2034 నాటికి ఒక ట్రిలియన్‌ డాలర్‌ ఎకానమి, 2047 నాటికి మూడు ట్రిలియన్‌ డాలర్ల ఎకానమిని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అంటే ప్రస్తుతం రూపాయికి డాలర్‌ విలువను బట్టి 2034 నాటికి రూ.92.35 లక్షల కోట్లు, దేశానికి స్వాతంత్య్రం వచ్చి వందేండ్లు పూర్తయ్యే 2047 నాటికి రూ.277 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థను నిర్మించాలని భావిస్తున్నది. అయితే ఆచరణలో ఇది ఏ మేరకు సాధ్యమ వుతుందో అన్నది వేచిచూడాల్సిందే. అయితే అందుకోసం కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమి (క్యూర్‌), పెరి అర్బన్‌ రీజియన్‌ ఎకానమి (ప్యూర్‌), రూరల్‌ అండ్‌ అగ్రి రీజియన్‌ ఎకానమి (రేర్‌) ప్రణాళికలను రూపొందించింది. ఆదాయం పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నది. అందులో భాగంగా రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన, రోడ్ల అనుసంధానం, రైళ్ల విస్తరణ, కొత్త విమానాశ్రయాలను నెలకొల్పడం, పరిశ్రమల స్థాపన, ఉద్యోగావకాశాలను పెంచడం వంటి లక్ష్యాలను నిర్దేశించుకుంది. తెలంగాణ రైజింగ్‌ లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్‌ కేటాయింపులు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నది.

హైదరాబాద్‌కు బడ్జెట్‌లో ప్రాధాన్యత
క్యూర్‌లో ఉన్న హైదరాబాద్‌ మహానగరాన్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. నగరంలో ఉన్న పరిశ్రమలను ప్యూర్‌, రేర్‌ మధ్యలో నెల కొల్పేలా ప్రణాళికలను రూపొందిం చింది. అందుకోసం పరిశ్రమల యాజమాన్యాలతో సంప్రదింపులు చేస్తున్నది. ఇప్పటికే గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)ని మూడు కార్పొ రేషన్లుగా విభజించింది. త్వరలోనే జీహెచ్‌ఎంసీతోపాటు వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లకు ఎన్నికలు రాబోతున్నాయి. హైదరాబాద్‌ మహానగర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌ కేటాయింపులు చేసే అవకాశమున్నది. మెట్రో రెండో దశ విస్తరణ, రోడ్ల నిర్మాణం, తాగునీరు, పారిశుధ్యం, మౌలిక వసతులు, డబుల్‌ బెడ్రూం ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వాటికి ప్రాధాన్యత ఇవ్వనుంది. 2020 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇద్దరు కార్పొరేటర్లను మాత్రమే గెలిచింది. బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో జీహెచ్‌ఎంసీ మేయర్‌ పీఠాన్ని సొంతంగా గెలవాలని భావిస్తున్నది. అందుకే రాష్ట్ర బడ్జెట్‌లో హైదరాబాద్‌కు ప్రాధాన్యత ఇచ్చే అవకాశ మున్నది. ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వాటికి కూడా నిధుల కేటాయింపులో ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తున్నది.

కొత్త పథకాలుంటాయా?
రాష్ట్రంలో ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, రేషన్‌కార్డుల పంపిణీ, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.పది లక్షల వరకు పెంపు వంటి హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. దానివల్ల కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్ల ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతున్నది. కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇంకా అమలు చేయాల్సినవి కూడా ఉన్నాయి. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, రైతుభరోసా కింద ఎకరాకు రూ.15 వేలు చెల్లింపు, విద్యార్థులకు రూ.ఐదు లక్షల వరకు విద్యా భరోసా కార్డు, ఆసరా పెన్షన్లు రూ.నాలుగు వేలకు పెంపు, నిరుద్యోగ భృతి రూ.నాలుగు వేలు, జాబ్‌ క్యాలెండర్‌ అమలు, రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, ఉద్యోగులకు పెండింగ్‌ డీఏల మంజూరు, 51 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ అమలు, కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌) రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం (ఓపీఎస్‌) పునరుద్ధరించడం, ఉద్యోగుల పెండింగ్‌ బిల్లుల చెల్లింపు వంటి వాటితో ఇతర హామీలను ప్రభుత్వం అమలు చేయాల్సి ఉన్నది. వాటికోసం ఆయా తరగతుల ప్రజలు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. రానున్న బడ్జెట్‌ సందర్భంగా కొత్త పథకాలను ప్రకటిస్తుందని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాలను ప్రారంభిస్తుందా?లేదా?అన్నది వేచిచూ డాల్సిందే.

ఏటా బడ్జెట్‌ కేటాయింపులు (కోట్లలో…)
ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌
2026-27 రూ.3,15,000?
2025-26 రూ.3,04,965
2024-25 రూ.2,91,159
2023-24 రూ.2,90,396

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -