– 30 మందికి గాయాలు.. ?
ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సః
నవతెలంగాణ – అశ్వారావుపే
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణంలోని గోగులుబంధం, షిరిడి సాయినగర్ ప్రాంతాల్లో సోమవారం పిచ్చికుక్క స్వైర విహారం కలకలం రేపింది. ఒక్కసారిగా గ్రామస్తులపై విరుచుకుపడిన కుక్క దాడిలో 30 మందికి పైగా గాయపడ్డారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు పలువురికి కాళ్లు, చేతులు, ముఖంపై కుక్క కాట్లు పడ్డాయి. గాయపడిన వారందరినీ చికిత్స కోసం అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు రాబీస్ టీకాలు తో పాటు అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న మున్సిపల్ సిబ్బంది గోగులుబంధం, షిరిడి సాయినగర్ పరిసర ప్రాంతాల్లో పిచ్చికుక్క కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పట్టణంలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతోందని, వెంటనే ప్రత్యేక చర్యలు చేపట్టి వీధి కుక్కలను నియంత్రించాలని గ్రామస్తులు మున్సిపల్ అధికారులను కోరుతున్నారు.



