Monday, June 16, 2025
E-PAPER
Homeజాతీయందాదాపు ఐదేండ్లుగా జైలులోనే

దాదాపు ఐదేండ్లుగా జైలులోనే

- Advertisement -

– 1704 రోజులుగా జరగని కోర్టు విచారణ : మాజీ విద్యార్థి నేత ఉమర్‌ ఖాలీద్‌ కష్టాలు
– నా కొడుకు తప్పు చేయలేదు
– బెయిల్‌ కోసం దిగువ కోర్టుల నుంచి ఉన్నత న్యాయస్థానం వరకు తిరిగాం
– ఇప్పటికీ కోర్టులో అభియోగాలు మోపలేదు
– ఉమర్‌ ఖాలీద్‌ తండ్రి ఇలియాస్‌
న్యూఢిల్లీ:
ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో హక్కుల కార్యకర్త, జేఎన్‌యూ మాజీ విద్యార్థి నాయకుడు ఉమర్‌ ఖాలీద్‌ దాదాపు ఐదేండ్లుగా జైలు జీవితాన్ని గడుపుతున్నాడు. పలుమార్లు ఆయన బెయిల్‌ కోసం ప్రయత్నాలు చేసినా.. అది లభించటం లేదు. ఇక బుధవారం నాటికి ఆయన ఎలాంటి కోర్టు విచారణా లేకుండా 1704 రోజులు జైలు జీవితాన్ని గడపాల్సిన కఠిన పరిస్థితి ఏర్పడింది. తన కొడుకు అమాయకుడనీ, బెయిల్‌ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నామని ఉమర్‌ ఖాలీద్‌ తండ్రి వాపోయాడు. వ్యవస్థలో వైఫల్యం కారణంగా ఉమర్‌ ఖాలీద్‌కు అన్యాయం జరుగుతున్నదని సామాజికవేత్తలు, హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకొచ్చిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా 2020లో తీవ్ర అల్లర్లు, నిరసనలు, ఆందోళనలు జరిగిన విషయం విదితమే. ఇందులో భాగంగా ఢిల్లీలో చెలరేగిన అల్లర్లలో భాగంగా పోలీసులు ఉమర్‌ ఖాలీద్‌తో పాటు మరో 17 మందిపై మత అల్లర్లలో కుట్ర కోణం ఉన్నదని కేసులు నమోదు చేశారు. వీరిలో ప్రస్తుతం ఆరుగురు మాత్రమే బెయిల్‌పై బయట ఉన్నారు. ఉమర్‌ ఖాలీద్‌పై చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం, ఆయుధ చట్టం, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద హత్య, ఉగ్రవాదం, రెచ్చగొట్టటం, దేశద్రోహం వంటి అభియోగాలను పోలీసులు మోపారు.
ఈ విషయంపై ఉమర్‌ ఖాలీద్‌ తండ్రి ఎస్‌.క్యూ.ఆర్‌. ఇలియాస్‌ మాట్లాడారు. ”ఢిల్లీ హైకోర్టులో ఇప్పటి వరకు ఐదు బెయిల్‌ విచారణలు జరిగాయి. బెయిల్‌ కోసం మేము దిగువ కోర్టు నుంచి మొదలై హైకోర్టుకు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లాం. ఇక్కడ తొమ్మిది నెలల్లో 14 వాయిదాలు పడ్డాయి. ఆ తర్వాత మేము తిరిగి దిగువ కోర్టుకు వెళ్లాం. ఇప్పుడు మళ్లీ హైకోర్టుకు వచ్చాం” అని చెప్పారు. ”ఉమర్‌ తప్పు చేయలేదు. అల్లర్ల సమయంలో ఆయన ఢిల్లీలో లేడు. ఆయన బెయిల్‌ నిరాకరణకు గురైంది. దారుణమైన నేరాలకు పాల్పడినవారినైతే అరెస్టు చేయరు, లేకపోతే బెయిల్‌పై వెంటనే విడుదల చేస్తారు. ఆయన (ఉమర్‌ ఖాలీద్‌) సీఏఏ వ్యతిరేక నిరసనలకు చెందిన ఒక వాట్సప్‌ గ్రూపులో ఉన్నందుకు ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. దాదాపు ఐదేండ్లు గడిచినా కోర్టులో అభియోగాలు మోపబడలేదు. ఈ విచారణ 10-15 ఏండ్లు కొనసాగవచ్చు. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్‌ బెయిల్‌ నియమం అని చెప్తూ చాలా మందికి బెయిల్‌ను మంజూరు చేశారు. అయితే, ఈ జాబితాలో ఉమర్‌ ఖాలీద్‌ లేడు. అమాయకులను వీలైనంత కాలం జైలులో ఉంచటానికి నల్ల చట్టాలను ఉపయోగిస్తున్నారనే దృగ్విషయాన్ని న్యాయవ్యవస్థ గ్రహించాలి” అని ఆయన అన్నారు. ఒక వ్యక్తిని దాదాపు ఐదేండ్లు విచారణ లేకుండా నిర్బంధించటం చట్టవిరుద్ధమని పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ అధ్యక్షురాలు కవితా శ్రీవాస్తవ ఆందోళన వ్యక్తం చేశారు. ఉమర్‌ ముస్లిం కావటం వల్లనే టార్గెట్‌ అవుతున్నాడని ఆరోపించారు. లైంగిక ఆరోపణల వ్యవహారంలో బీజేపీ మాజీ ఎంపీ, రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ చీఫ్‌పై ఇప్పటికీ విచారణ కొనసాగుతున్నా.. ఆయనకు బీజేపీ మద్దతున్నదని ఆమె చెప్పారు. ఆయన కొడుకుకు పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయటానికి టికెట్‌ ఇచ్చిన విషయాన్నీ గుర్తు చేశారు. బిల్కిస్‌ బానో లైంగి కదాడి దుండగులను సత్కరించారనీ, బీజేపీ నేరాన్ని కీర్తించే సంస్కృతిని సృష్టిం చిందని ఆరోపించారు. ఇది వ్యవస్థ వైఫల్యానికి సంబంధించినదని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -