– ఇద్దరు నిర్వాహకులు అరెస్ట్..
– ఇద్దరు మహిళలకు రక్షణ
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ గృహంపై శుక్రవారం పోలీసులు దాడి నిర్వహించారు. స్థానిక ఎస్ హెచ్ ఓ ఎస్ ఎస్ ఐ యయాతి రాజు తెలిపిన వివరాల ప్రకారం.. పాల్వంచ సబ్ – డివిజనల్ పోలీసు అధికారి ఆదేశాల మేరకు అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ సబ్ – ఇన్స్పెక్టర్ యయాతి రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడిలో ప్రధాన నిర్వాహకుడు నాయుడు ముత్యాలరావుతో పాటు మరో మహిళను అదుపులోకి తీసుకున్నారు. అలాగే అక్కడ ఉన్న ఇద్దరు మహిళలను పోలీసులు రక్షించారు.
పోలీసుల విచారణలో నాయుడు ముత్యాలరావు, మరో మహిళ కలిసి ఇతర ప్రాంతాల నుంచి మహిళలను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది. నిందితులపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. వ్యభిచారం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు తమ పరిసరాల్లో అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.



