పుట్టెడు దుఃఖంలో పరీక్షలకు వెళ్లిన కొడుకు
పాంబండ గ్రామంలో హృదయవిధాయకర ఘటన
నవతెలంగాణ -శివ్వంపేట :
అల్లారు ముద్దుగా పెంచిన తండ్రి అకాల మరణం చెందగా, పుట్టెడు దుఃఖంలో ఉన్న కొడుకు తండ్రి శవాన్ని ఇంటివద్ద విడిచి పెట్టి పది పరీక్షలకు హాజరైన హృదయ విధాయకర సంఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని పాంబండ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.. స్థానికుల వివరాల ప్రకారం పాంబండ గ్రామానికి చెందిన కుమ్మరి నాగరాజు (45) వృత్తిరీత్యా మేస్త్రీ పనులు చేస్తుండగా అతని భార్య అంజమ్మ కూలీ పనులు చేస్తుంటుంది. నాగరాజు దంపతులకు ముగ్గురు మగ సంతానం.
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామంలో బంధువుల దశ దినకర్మకు శుక్రవారం అంజమ్మ వెళ్లి సాయంత్రం ఇంటికి వస్తున్న క్రమంలో ఆమెను భర్త నాగరాజు తన బైక్ పై ఎక్కించుకొని స్వగ్రామానికి వస్తుండగా ఉసిరికపల్లి కొట్టాల వద్ద బైక్ అదుపుతప్పి కింద పడిన నాగరాజు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించారు. శనివారం నాగరాజు అంత్యక్రియలు జరగాల్సి ఉండగా అతని రెండో కొడుకు ధనుష్ శనివారం పది పరీక్షలకు తండ్రి శవాన్ని విడిచి వెళ్లాల్సి వచ్చింది. తూప్రాన్ సేయింట్ అండ్రీవ్స్ పాఠశాలలో పదో తరగతి చదువుతూ నేడు విదిలేని పరిస్థితిలో కన్న తండ్రి శవాన్ని విడిచి, తన భవిష్యత్ కోసం దుఖాన్ని దిగమింగుతూ, తండ్రి శవాన్ని మోయాల్సిన కొడుకు..పది పరీక్షలకు వెళ్లాల్సి రావడంతో అక్కడున్న ప్రతి ఒక్కరి కళ్ళలో కన్నీటి సుడులు తిరుగుతూ ధనుష్ ను అత్తుకుని కన్నీటి పర్యాంతర మాయ్యారు.



