నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఢిల్లీలో శాంతియుతంగా పార్లమెంట్ మార్చ్ నిర్వహిస్తున్న విద్యార్థులు, యువకులపై పోలీసుల అమానుష లాఠీచార్జీ, టియర్గ్యాస్ ప్రయోగం, నిర్బంధాలను భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ ఖండించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్, ఆనగంటి వెంకటేష్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్యయూతంగా నిరసన వ్యక్తం చేస్తున్న యువత, విద్యార్థులను అడ్డుకునేందుకు అడుగడుగునా ఇనుప బారికేడ్లతో అడ్డుకోవడం, మెట్రో స్టేషన్లను విద్యార్థులు లోపల ఉండగానే మూసివేయడం, వేలాది మంది పోలీసు బలగాలను మోహరించడం సిగ్గుచేటని తెలిపారు. విద్యార్థుల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన కేంద్ర ప్రభుత్వం పోలీసు లాఠీలతో స్పందించడం మోదీ ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమని విమర్శించారు. ఎన్టీఏలో చోటుచేసుకున్న అవినీతి, వరుస పరీక్షా కుంభకోణాలు, పారదర్శకత లోపం కారణంగా దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని తెలిపారు. ఈ పేపర్ లీకేజీ కుంభకోణాలతో ఇప్పటికే 23 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. వారి కుటుంబాల ఆవేదనను, విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను కేంద్రం పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. పేపర్ లీకేజీలకు బాధ్యత వహించాల్సిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను పదవి నుంచి తప్పించకుండా కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. అక్రమంగా నిర్బంధించిన విద్యార్థులను, యువతను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులపై లాఠీచార్జీకి డీవైఎఫ్ఐ ఖండన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



