సిలికాన్ వ్యాలీ : కృత్రిమ మేధ (ఏఐ) విస్తరణ టెక్ రంగంలో ఉద్యోగుల పాలిటశాపంగా మారుతోంది. ఇప్పటికే గడిచిన రెండేండ్లలో భారీగా సిబ్బందిని తగ్గించుకున్న ఫేస్బుక్ మాతృసంస్థ మెటా మరోసారి వేలాది మందిని రోడ్డున పడేసే పనిలో ఉంది. ఏకంగా 16,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపేందుకు మార్క్ జుకర్బర్గ్ బృందం ప్రణాళికలు రచిస్తోందని అంతర్జాతీయ మీడియాలో రిపోర్టులు వస్తోన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో తన పట్టును నిరూపించుకునేందుకు మెటా వేల కోట్ల డాలర్లను కుమ్మరిస్తోంది. 2028 నాటికి డేటా సెంటర్ల ఏర్పాటు కోసం దాదాపు 600 బిలియన్ డాలర్లు వెచ్చించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే.. ఈ భారీ ఖర్చును భర్తీ చేయడానికి, ఏఐ సేవలపై దృష్టి పెట్టడానికి మనుషుల అవసరం లేదని మెటా భావిస్తున్నట్టు సమాచారం. తన మొత్తం సిబ్బందిలో 20శాతం మందిని తొలగించాలని కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్స్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. మెటా చరిత్రలో ఇవి మూడవ అతిపెద్ద తొలగింపులు కానున్నాయి. 2022 చివర్లో 11 వేల మందిని, 2023లో 10 వేల మందిని తొలగించిన సంస్థ.. ఇప్పుడు మరో 16 వేల మందిపై వేటు వేయడం కంపెనీలోని అనిశ్చితిని ప్రతిబింబిస్తోంది. మెటా నుంచి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, సీనియర్ లీడర్లతో జరిగిన అంతర్గత చర్చల్లో ఈ విషయం ఖరారైనట్టు తెలుస్తోంది. తాజా పరిణామాలతో ప్రస్తుతం ఉన్న 79వేల మంది సిబ్బందిలో ఎవరి ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియని ఆందోళన నెలకొంది.



