నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి డిపోకు చెందిన వివిధ సంఘాలకు 36 మంది ఆర్టీసీ ఉద్యోగులు నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ) లో చేరారు. బుధవారం స్థానిక కళాభారతిలో డిపో కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎన్ఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి మౌలానా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇతర యూనియన్ల నుంచి కార్మికులు అధిక సంఖ్యలో ఎన్ఎంయూ లోకి రావడం ఎంతో ఆనందదాయకమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా రిక్రూట్మెంట్లు లేకపోవడం వల్ల ప్రస్తుతం ఉన్న ఉద్యోగులపై పని ఒత్తిడి బాగా పెరిగిపోయిందని తెలిపారు. మహాలక్ష్మి పథకం అమలులోకి వచ్చినప్పటి నుంచి ఆర్టీసీ సిబ్బంది తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికుల శ్రేయస్సు కోసం పోరాడే ఎన్ఎంయూని అందరూ ఆదరించాలని కోరారు.
ఈ సందర్భంగా టీఎంయూ, ఐఎన్టీయూసీ సంఘాలకు చెందిన 36 మంది కార్మికులు ఎన్ఎంయూ సభ్యత్వం తీసుకున్నారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు సత్యం, కేఎస్ పాల్, ఎల్ఆర్కే రావు, బాలస్వామితో పాటు 120 మంది పాల్గొన్నారు.



