అగ్రికల్చర్ అధికారిని కే. సంధ్యారాణి
నవతెలంగాణ -ఆర్మూర్
ఆయిల్ ఫామ్ చెట్ల పెంపకంలో రైతులు తగు జాగ్రత్తలు పాటించాలని అగ్రికల్చర్ అధికారిని కె సంధ్యారాణి సూచించారు. ఆలూరు మండల కేంద్రంలో సోమవారం ఆయిల్ ఫామ్ చెట్లను పరిశీలించారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 4 సంవత్సరాల చెట్టుకు 200 నుండి 250 లీటర్ల నీళ్లు ఇవ్వాల్సి ఉంటుందని , డ్రీప్ కు కనీసం నాలుగు నుంచి ఐదు గంటలు నడిపించాలని తెలిపారు. చెట్టు చెట్టుకు మధ్య రెండు అడుగుల దూరంలో జనుము, జిలుగ వంటి పచ్చి రొట్టె ఎరువులు, విత్తనాలు వెదజల్లాలని సూచించారు.
45 నుంచి 60 రోజుల మధ్యలో కట్ చేసి అక్కడే కలపాలని, మంచి ఎరువుగా పనిచేస్తుందని, సేంద్రియ ఎరువులు ఒక చెట్టుకు 25 నుంచి 40 కిలోలలో ఇవ్వవచ్చని అన్నారు. ఎండిపోయిన మట్టలు కోసి చెట్ల పొదల్లో వేస్తే మూల్చింగ్ ల పనిచేస్తుందని తెలిపారు. భూమిలోను తేమను పట్టి ఉంచుతుందని అన్నారు. ముఖ్యంగా వేసవిలో ఎరువులు నీరుగా ఇవ్వడం కంటే డ్రీప్ ద్వారా ఇవ్వడం మేలని, వేసవికాలంలో బోరాన్ లోపం ఎదురయ్యే అవకాశం ఉన్నందున బోరాక్స్ కానీ సోల్బార్ కానీ స్ప్రే చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ ఏరియా మేనేజర్ సాయికిరణ్, క్లస్టర్ ఆఫీసర్ అరుణ్, ప్రియా యూనిట్ ఆయిల్ ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు, ఆయిల్ ఫామ్ రైతులు పాల్గొన్నారు.



