ఇ 20 ఇంధనంపై
అధ్యయనంలో కేంద్రం వెల్లడి
న్యూఢిల్లీ : ఇ 20 ఇంధనాన్ని ఉపయోగించేటపుడు బీఎస్-3 వాహనాల్లో కొన్ని రబ్బర్ భాగాలు, గాస్కెట్లను మార్చాల్సిన అవసరం రావచ్చని కేంద్రం నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం బుధవారం పార్లమెంట్కు తెలియజేసింది. ‘‘2005 ఏప్రిల్ 1 నుంచి ప్రవేశపెట్టిన , 2016కు ముందు తయారుచేసిన బీఎస్-3 వాహనాలపై పరీక్షలు చేసినపుడు కొన్ని రబ్బర్ భాగాలను, గాస్కెట్లను మార్చాల్సిన అవసరం కనిపించింది. వాహనాన్ని రొటీన్గా సర్వీసింగ్ చేయించేటప్పుడు వీటిని సులభంగానే నిర్వహించుకోవచ్చు.’’ అని అధ్యయన వివరాలను ఉటంకిస్తూ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాజ్యసభలో తెలిపారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, డెహ్రాడూన్కి చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, ది సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్, ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలు సంయుక్తంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించాయి. అయితే ఆ అధ్యయన వివరాలను ఇంకా బహిరంగపరచలేదు. వాహన పనితీరు, ఇంధన సామర్ధ్యం, ఇంజన్ మన్నిక, నిర్వహణా వ్యయాలు వంటి అంశాలపై ఇ 20 ఇంధన ప్రభావం ఎలా ఉంటుందంటూ సీపీఐ ఎంపీ ఎ.ఎ.రహీమ్ అడిగిన ప్రశ్నకు గడ్కరీ పై రీతిన స్పందించారు.
బీఎస్-3 వాహనాలు కాని వాటికి కారు, ద్విచక్ర వాహనాల ఇంజన్లను మార్చాల్సిన అవసరం లేదని అధ్యయనం నిరూపించిందని మంత్రి స్పష్టం చేశారు. పాత తరానికి చెందిన వాహనాలను ఇ 20 ఇంధనంతో నడిపినపుడు కూడా వాటి పనితీరులో ఎలాంటి గణనీయమైన మార్పులు కనిపించలేదని ,అలాగే అసాధారణమైన రీతిలో అరుగుదల కూడా కనిపించలేదని గడ్కరీ తెలిపారు. అలాగే వాహనాలు నడిపే, స్టార్ట్ చేసే సౌలభ్యాలకు సంబంధించి కూడా ఎలాంటి సమస్యలు కనిపించలేదన్నారు. లోహాలు, ప్లాస్టిక్లకు సంబంధించి కూడా సమస్యలు తలెత్తలేదని చెప్పారు. దేశంలో సైబర్ నేరాలు మూడు రెట్లు పెరిగినట్టు కేంద్రం తెలిపింది. 2020లో సైబర్ మోసాల సంఖ్య 10,395 ఉండగా, 2024నాటికి ఈ సంఖ్య 29,758కి పెరిగిందని పేర్కొంది. గతేడాదిలో తెలంగాణాలో ఈ నేరాలు అధికంగా నమోదయ్యాయి.
2024లో గుర్తించిన కేటగిరీల్లో ఆన్లైన్ బ్యాంకింగ్ మోసం ప్రధానంగా ఉంది. ఈ కేటగిరీ కింద 4659 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానంలో క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ మోసాలు ఉన్నాయి. ఇక వరుసగా మార్కెటింగ్ లేదా పెట్టుబడుల మోసాలు (3044), ఎటీఎం మోసం (1659), మోసపూరిత కాల్ (1264), గేమింగ్ యాప్ లేదా వెబ్సైట్ మోసాలు (1019), ఓటీపీ మోసాలు(965), ఇ వాలెట్ లేదా యూపీఐ మోసాలు (723) వున్నాయి. రాష్ట్రాలవారీగా చూసినట్లైతే తెలంగాణాలో 2024లో రికార్డు స్థాయిలో ఈ తరహా కేసులు 18,922 నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానాల్లో బీహార్ (4020), మహారాష్ట్ర (2827), ఒడిశా (1546) వున్నాయి. అయితే ఈ కేసుల్లో ఎంత మొత్తం డబ్బు నష్టపోయారు లేదా రికవరీ చేశారనే వివరాలకు సంబంధించిన డేటాను జాతీయ నేర గణాంకాల బ్యూరో (ఎన్సీఆర్బీ) రూపొందించలేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాజ్యసభలో రాతపూర్వక సమాధానంలో తెలిపారు.



