మట్టి మీద మరణ శాసనం గీస్తున్న మాంత్రికుడు వాడు.. యుద్ధం ఓ శిథిల స్వప్నం.. వినాశ భవిష్యత్తు శాసనం..సామ్రాజ్యవాద చావు కబురు.అక్కడ ఆయిల్ బదులు మానవత్వం మండుతోంది అంటూ ప్రముఖ కవి ,రచయిత ఎన్. తిర్మల్ తన కవిత్వంతో యుద్ధ భావ జాలాన్ని తీవ్రంగా ఎండగట్టారు. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా తెలంగాణ సాహితి జిల్లా కమిటి ఆధ్వర్యంలో యుద్ధం – శాంతి అనే అంశంపై ఖమ్మం (పెవిలియన్ గ్రౌండ్) శాఖా గ్రంథాలయంలో జరిగిన కవిసమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు. అగ్రరాజ్య అమెరికా విధానాలను ఆయన ఎండగట్టారు. సుస్థిర శాంతిని ఛిద్రం చేసే యుద్ధ కాంక్ష ఓ మానసిక రుగ్మత.. సామ్రాజ్య వాదులెవరికైనా అంతకంతా పరాభవం తప్పదు అని సభకు అధ్యక్షత వహించిన తెలంగాణ సాహితి జిల్లా కన్వీనర్ కటుకోఝ్వల రమేష్ తన కవితలో ఉద్ఘాటించారు. కార్యక్రమానికి ముందు యుద్ధంలో మరణించిన వారికి కవులు సంతాపం ప్రకటించారు.
బాల్యాకాశం నిండా క్షిపణుల వాన.. వాళ్ళకిప్పుడు శాంతి ఆకాశం కావాలి అని కవులు గరికపాటి మణింధర్,ఇది అగ్రరాజ్య అమెరికా నీచ కుతంత్రం అని సి.హెచ్.ఆంజనేయులు, యుద్ధం ఏం మిగిలించింది.. మట్టి, మరణం, నిశ్శబ్దం.. అని పొత్తూరి సీతారామారావు, భూమి బద్దలవుతుంది.. వసంతం తెస్తావా పరాభవా… అంటూ ఏం.వి.రమణ, మన ఇంటిపై దాడి చేసినా చెప్పేవాడు నాన్న.. యుద్ధం ఏం చేస్తుందో చూడు. పరాభవా అంటూ.. అక్షరాల త్రోవ .. నామా పురుషోత్తమ్ తమ కవితల్లో అక్షర శతఘ్నులను సంధించారు. కవయిత్రులు యుద్ధ భీభత్సం వీడు.. శాంతి దీపం వెలిగించు అంటూ జిగీష,నేడు మనసంతా యుద్ధ వార్తల గుబులు.. భూమి తనువెల్లా నెత్తుటి గాయాలే… అని స్వాతి,చరిత్ర పాటల్ని చెరపలేని చేతకాని తనాన్ని ధరిత్రి ఎన్నటికీ క్షమించదు అని తాళ్లూరి రాధ, మానవత్వం బ్రతికితే మనిషి బ్రతికి బట్టేనని సైకాలజిస్ట్ లక్ష్మీ, తన కవితా పంక్తులతో సభను అలరించారు.
ఇంకా కవులు జి.విద్యాసాగర్, బషీర్, సాధన, గాజుల భారతి, బాలకవి మోక్షిత్లు యుద్ధం వల్ల సంభవించే సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై కవితా శరాలను సంధించారు. సాహితీ వేత్తలు మువ్వా శ్రీనివాసరావు, సవ్యసాచి, కపిల రామ్ కుమార్, బండారు రమేష్ లు పంపిన యుద్ధ వ్యతిరేక కవితల్ని సభలో చదివారు. యుద్ధ వాతావరణాన్ని అమానవీయతను వాళ్ల కవితలు అద్దం పట్టాయి. రాష్ట్రంలో వివిధ జిల్లాలలో తెలంగాణ సాహితి ఆధ్వర్యంలో యుద్ధ వ్యతరేక కవి సమ్మేళనాలను ఉగాది సందర్భంగా నిర్వహించారు. నల్గొండలో యు.టి.ఎఫ్., తెలంగాణ సాహితి సంయుక్తంగా ఏర్పాటు చేశారు. కుకుడాల గోవర్థన్, యు.టి.ఎఫ్.నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్లో శంకరయ్య, రాములు, సతీష్ నిర్వహణలో అన్నవరం దేవేందర్ అతిథిగా పాల్గొన్నారు. భువనగిరిలో భాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో కవి సమ్మేళనం జరిగింది. కోదాడలో పుప్పాల కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన కవి సమ్మేళనంలో 40 మంది కవులు యుద్ధ వ్యతిరేక కవిత్వాన్ని వినిపించారు. ఈ సంద్భంగా ‘వేకువ కిరణాలు’ కవితా సంకలనాన్ని ఆవిష్కరించారు.
- డా.కటుకోఝ్వల రమేష్, 9949083327



