ఏపూరి వెంకటేశ్వర్ రావు మాదిగ
నవతెలంగాణ -పరకాల
మత దురహంకారం, కుల వివక్షత, సామాజిక అసమానతలు లేని సమ సమాజ నిర్మాణం కోసం ఎంఆర్పీఎస్ ఉద్యమం నిరంతరం పోరాడుతుందని ఎంఆర్పీఎస్ హనుమకొండ జిల్లా ఇంచార్జి ఏపూరి వెంకటేశ్వర్ రావు మాదిగ అన్నారు.సోమవారం పరకాల మండల కేంద్రంలోని అమరధామంలో ఎంఆర్పీఎస్ పరకాల మండల ఇంచార్జి అంకిల్ల రాజు మాదిగ, కో-ఇంచార్జి ఉమామహేశ్వర్ మాదిగ ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపూరి వెంకటేశ్వర్ రావు మాదిగ మాట్లాడుతూ, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మూడు దశాబ్దాలుగా రాజీలేని పోరాటంతో ఎస్సీ వర్గీకరణ సాధించడమే కాకుండా పేద, అణగారిన వర్గాల సంక్షేమం కోసం ఎంఆర్పీఎస్ పలు ఉద్యమాలు నిర్వహించి అనేక విజయాలు సాధించిందన్నారు.దేశంలో కులవ్యవస్థ కారణంగా అణగారిన వర్గాలు వివక్షకు గురై పేదరికంలోనే మిగిలిపోయాయని, వారి ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం ప్రజా సమస్యలను గుర్తించి బలమైన ప్రజా పోరాటాలు నిర్మించాలని పిలుపునిచ్చారు.
ఎంఆర్పీఎస్తో పాటు అన్ని అనుబంధ విభాగాల కమిటీలు రద్దయిన నేపథ్యంలో గ్రామస్థాయి నుంచి నూతన కమిటీల నిర్మాణ ప్రక్రియ చేపట్టి సంస్థను మరింత బలోపేతం చేయాలని కోరారు. విద్యార్థులు, యువతను ఉద్యమంలోకి తీసుకువచ్చి శక్తివంతమైన ఉద్యమ సైన్యంగా తీర్చిదిద్దేందుకు శ్రేణులు క్షేత్రస్థాయిలో కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశానికి ఎంఎస్పీ మాజీ జిల్లా అధ్యక్షుడు బండారి సురేందర్ మాదిగ, ఎంఆర్పీఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు గద్దల సుకుమార్ మాదిగ విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో పెండ్యాల మహేందర్ మాదిగ, పసుల సంపత్ మాదిగ, వెంకటాపురం చిరంజీవి మాదిగ, చేరపాక రవి, శ్రీనివాస్ మాదిగతో పాటు పలువురు ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



