– రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా నియామకం
నవతెలంగాణ – సత్తుపల్లి
తెలంగాణ తెలుగు భాష సంరక్షణ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా సత్తుపల్లికి చెందిన ప్రముఖ కవయిత్రి, విశ్రాంత ఉపాధ్యాయిని బత్తిన గీతాకుమారి నియమితులయ్యారు. గత రెండు దశాబ్దాలుగా తెలంగాణ సాహితీ రంగంలో విశేష సేవలందిస్తున్న సంఘ నూతన రాష్ట్ర కార్యవర్గంలో స్థానం దక్కించుకున్న గీతాకుమారి 34 సంవత్సరాల పాటు ఉపాధ్యాయినిగా సేవలుందించి, ఖమ్మం జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డును సైతం దక్కించుకున్నారు. గత ఇరవై ఏళ్లుగా కవయిత్రిగా, రచయిత్రిగా, సమీక్షకురాలిగా, సమూహ నిర్వాహకురాలిగా విభిన్న రీతుల్లో సాహితీ సేవ చేస్తున్నారు. వచనకవిత్వం, ఇష్టపదులు, బాలసాహిత్యం, గేయరచన, వ్యాసాలు, కథలు, లఘు ప్రక్రియలు గజల్స్, పత్రికల్లోనూ, వాట్సాప్ సమూహాల్లోనూ రచనలు చేస్తూ అపార అభిమానాన్ని సంపాదించుకున్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయి పురస్కారాలతో పాటు ఎన్నో సంస్థల నుంచి జాతీయ, రాష్ట్ర స్థాయి పురస్కారాలు, బిరుదులను అందుకొని సత్తుపల్లి ప్రాంత గౌరవాన్ని పెంచిన ఆమెకు తెలంగాణ తెలుగు భాష సంరక్షణ సంఘంలో చోటు లభించడం పట్ల సాహితీ ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ సాహితీ రంగానికి తనవంతు సేవను బాధ్యతాయుతంగా అందిస్తానని పేర్కొంటూ, తనకు ఈ అవకాశం కల్పించిన అధ్యక్ష, కార్యదర్శులు దాస్యం సేనాధిపతి, బుర్ర మధుసూదనరెడ్డిలకు గీతాకుమారి కృతజ్ఞతలు తెలిపారు.



