Thursday, August 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంహైడ్రా పేరుతో నకిలీ ఫైర్‌ ఎన్‌ఓసీలు

హైడ్రా పేరుతో నకిలీ ఫైర్‌ ఎన్‌ఓసీలు

- Advertisement -

కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌
సంతకం ఫోర్జరీ
ఆ కళాశాలలపై చర్యలకు 
ఇంట‌ర్ బోర్డుకు లేఖ‌
జులై 4న‌ లేక్ పోలీసుల‌కు 
హైడ్రా ఫిర్యాదు
నవతెలంగాణ-సిటీబ్యూరో

​హైడ్రా పేరుతో నకిలీ ఫైర్‌ ఎన్‌‌ఓసీలు వెలుగులోకి వచ్చాయి. ఏకంగా హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ ‌సంతకం ఫోర్జరీ కావడం సంచలనంగా మారింది. దాంతో న‌కిలీ ఫైర్ ఎన్‌వోసీల విష‌యాన్ని హైడ్రా సీరియ‌స్‌గా ప‌రిగ‌ణించింది. ఇప్ప‌టికే ఇంట‌ర్ బోర్డుకు లేఖ రాసి వివ‌రాలు తీసుకున్న హైడ్రా, జులై 4న లేక్ పోలీసు స్టేష‌న్‌‌లో ఫిర్యాదు చేసింది. జూనియర్ కళాశాలల యాజమాన్యాలు సమర్పించిన నకిలీ/ఫోర్జరీ ఫైర్ ఎన్‌వోసీలపై విచారణ చేప‌ట్టింది. ఈ నేప‌థ్యంలో పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌లు, ఆస్పత్రులు, వ్యాపార స‌ముదాయాల నిర్వాహ‌కుల‌తో స‌మావేశం ఏర్పాటు చేసి ఎన్‌వోసీపై మార్గ‌ద‌ర్శ‌కం చేసింది. తెలంగాణ కోర్ అర్బ‌న్ రీజియ‌న్ (టీసీయూఆర్‌) ప‌రిధిలో 142 జూనియ‌ర్ క‌ళాశాల‌లు ఫైర్ ఎన్‌వోసీలు స‌మ‌ర్పించ‌గా, అందులో 90 వ‌ర‌కు అసలువి ఉండ‌గా, 52 ధ్రువ‌ప‌త్రాలు న‌కిలీవ‌ని తేలింది. ఈ న‌కిలీ ప‌త్రాలు స‌మ‌ర్పించిన వారిపై త‌దుప‌రి చ‌ర్య‌ల‌కు ఉద్దేశించి జులై 4న నెక్లెస్ రోడ్డులోని లేక్ పోలీసు స్టేష‌న్‌‌లో హైడ్రా అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదిలావుండగా 2025–26, 2026–27 విద్యా సంవత్సరాలకు సంబంధించి జూనియర్ కళాశాలల యాజమాన్యాలు సమర్పించిన ఫైర్ ఎన్‌వోసీల పత్రాలను హైడ్రా ప‌రిశీలిస్తోంది. మొదటి దశలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులు (డీఐఈఓ) మొత్తం 76 ఫైర్ ఎన్‌వోసీలను ప్రామాణికత నిర్ధారణ కోసం పంపించారు. వాటిని హైడ్రా కార్యాలయ రికార్డులతో పరిశీలించగా, 7 ఫైర్ ఎన్‌వోసీలు నకిలీ/ఫోర్జరీవ‌ని తేలింది. రెండో దశలో సంబంధిత జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులు మొత్తం 66 ఫైర్ ఎన్‌వోసీలను ధ్రువీకరణ కోసం పంపించారు. వీటిని కూడా హైడ్రా కార్యాలయ రికార్డులతో పరిశీలించగా, 45 ఫైర్ ఎన్‌వోసీలు నకిలీ/ఫోర్జరీ చేసినవిగా తేలింది. ఈ మేర‌కు ఆయా క‌ళాశాల‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఇంట‌ర్ బోర్డుకు హైడ్రా సూచించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -