Friday, March 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజీహెచ్‌ఎంసీని శాస్త్రీయంగా విభజించాం

జీహెచ్‌ఎంసీని శాస్త్రీయంగా విభజించాం

- Advertisement -

మెరుగైన సేవలందించేందుకే గ్రామాల విలీనం
పన్నులు పెరుగుతాయనేది అపోహ మాత్రమే
రాజకీయాల కోసం మూసీని అడ్డుకోవద్దు : శాసనసభలో మంత్రి డి.శ్రీధర్‌బాబు
అసెంబ్లీ 28కి వాయిదా


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

జీహెచ్‌ఎంసీని శాస్త్రీయంగా విభజించామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. గురువారం శాసన సభలో బడ్జెట్‌ పద్దులపై జరిగిన చర్చ సందర్భంగా మున్సిపల్‌ అడ్మినిష్ట్రేషన్‌పై కేపీ వివేకానంద, జాఫర్‌ హుస్సేన్‌, పాల్వాయి హరీశ్‌, సునితా లక్ష్మారెడ్డి, అనిల్‌ కుమార్‌రెడ్డి మొదలగు సభ్యులు అడిగిన ప్రశ్నలను ఆయన సమాధానం చెప్పారు. ”ఈ రంగంలో నిష్ణాతులైన వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని 330 వార్డులు, 60 సర్కిళ్లు, 12 జోన్లుగా మార్చాం. 625 కిలోమీటర్ల నుంచి 2,053 చదరపు కిలోమీటర్లకు పెంచాం” అని మంత్రి తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకే గ్రామాలను మున్సిపాల్టీల్లో విలీనం చేశామని అన్నారు.

పన్నులు పెరుగుతాయనేది అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు. భూముల ధరలు పెరగడంతో పాటు మౌళిక సదుపాయాలు, మెరుగైన సేవలు ప్రజలకు అందుతాయన్నారు. హైడ్రా చేస్తున్నది వింధ్వంసం కాదనీ, భవిష్యత్‌ తరాల కోసం ప్రకృతిని కాపాడుతోందని పేర్కొన్నారు. రాజకీయాల కోసం మూసీని అడ్డుకోవద్దని శ్రీధర్‌బాబు విజ్ఞప్తి చేశారు. అన్ని పార్టీలతో పాటు ప్రజలందరూ మూసీ పునరుజ్జీవనానికి సహకరించాలని కోరారు. ”తెలంగాణ రైజింగ్‌ 2047” లక్ష్యంగా త్రీ ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను చేరుకునేందుకు పని చేస్తున్నామని అన్నారు. పట్టణ పరిపాలన సేవల పంపిణిని మెరుగు పర్చడానికే కోర్‌, ప్యూర్‌, రేర్‌ విధానాన్ని తీసుకొచ్చామని తెలిపారు.

హైదరాబాద్‌తో పాటు టైర్‌ టూ, త్రీ నగరాలు అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. గత సర్కార్‌ లాగా కాకుండా రాష్ట్రంలోని అన్ని పట్టణాలకు సమానంగా నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది రూ. రూ.689 కోట్లు కేంద్రం నుంచి తీసుకొచ్చామని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ సభ్యులు హరీశ్‌రావు పేర్కోన్న మెమో కొత్త పాలసీ కాదన్నారు. పీఆర్సీ గడువు పెంచుతూ సర్కార్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనీ, 2020 సంవత్సరంలో ఇచ్చిన పే ఫిక్సేషన్‌ గడువు పెంచుతూ ఆర్థిక శాఖ ఇచ్చిన మెమో మాత్రమేనని శ్రీధర్‌బాబు తెలిపారు. మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించిన పలు పద్దులను సభ ఆమోదించింది. తెలంగాణ లెజిస్ట్రేటివ్‌ స్పోర్ట్స్‌, కల్చరల్‌ ఈవెంట్‌లో పాల్గొనే సభ్యులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ ప్రకటించారు. అనంతరం సభను ఈ నెల 28 శనివారానికి వాయిదా వేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -