పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్న ఘటన
నవతెలంగాణ-బంజారాహిల్స్
హైదరాబాద్లో గ్యాస్ బుక్ చేసినప్పటికీ చాలా రోజుల వరకు సిలిండర్లు అందకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఫిలింనగర్ పరిధిలోని షేక్పేట్ ప్రాంతంలో గ్యాస్ సిలిండర్లను ఆటో నుంచి కొందరు వినియోగదారులు ఎత్తుకెళ్లిన ఘటన పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం షేక్పేట్లోని ఇండియన్ ఎల్పీజీ గ్యాస్ సప్లయర్కు చెందిన ఆటో నిండు సిలిండర్లతో సరఫరా చేయడానికి ఓ గల్లీకి చేరుకుంది.
అయితే బుకింగ్ వివరాలు పరిశీలించి ఖాళీ సిలిండర్లు తీసుకునేలోపే.. కొంతమంది బుకింగ్ పుస్తకాలు, ఖాళీ సిలిండర్లను పక్కన పెట్టి ఆటోలోని సిలిండర్లను ఎత్తుకెళ్లడంతో డ్రైవర్, సప్లయర్ ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే వారు స్పందించి స్థానికుల సహకారంతో కొంతమందిని అడ్డుకున్నారు. అయితే కొందరు మాత్రం సిలిండర్లు తీసుకుని వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు స్థానిక బస్తీ నాయకులతో చర్చించి అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పినట్టు సమాచారం. ఈ ఘటనతో కాలనీల్లో సిలిండర్లను సరఫరా చేయడానికి రావాలా వద్దా అనే ఆందోళన సిబ్బందిలో వ్యక్తమవుతోంది. తమ ఉద్యోగాల భద్రతపై కూడా అనిశ్చితి నెలకొందని వారు అంటున్నారు.
ఫిలింనగర్లో గ్యాస్ సిలిండర్లు ఎత్తుకెళ్లిన ప్రజలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



