నవతెలంగాణ – సత్తుపల్లి
యూఎస్పీఎస్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు శుక్రవారం చేపట్టిన నల్ల బ్యాడ్జీలు నిరసన కార్యక్రమం సత్తుపల్లి మండలంలో టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా సత్తుపల్లి మండలంలోని గంగారం, కాకర్లపల్లి ఉన్నత పాఠశాలలతో పాటు పలు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ… పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న 6 డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించాలని కోరారు. అలాగే జీవో నెంబర్ 25ను వెంటనే సవరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పీఆర్సీ ఇచ్చేంత వరకు ఈ నిరసన కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులందరికీ సత్తుపల్లి యూఎస్పీఎస్ పక్షాన భాగస్వామ్య సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో చేపట్టబోయే తీవ్రతర పోరాటాలకు ఉపాధ్యాయులంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ నిరసనలో టీఎస్యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఉమామహేశ్వర రెడ్డి, సత్తుపల్లి మండల అధ్యక్షులు హెచ్. సూరయ్య, టీపీటీఎఫ్ నాయకులు కొత్తా శ్రీనివాసరావు, నరసింహారావుతో పాటు తదితర సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



