నవతెలంగాణ–బోడుప్పల్: మేడ్చల్ జిల్లా బోడుప్పల్ సర్కిల్లో బోనాల పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కాంగ్రెస్ ఫ్లెక్సీ రాజకీయ చర్చకు దారితీసింది. పండుగ సందడి కంటే ఫ్లెక్సీలో ప్రముఖ నాయకుల ఫొటోలు లేకపోవడమే స్థానికంగా హాట్టాపిక్గా మారింది. బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తదితర ముఖ్య నాయకుల ఫొటోలు కనిపించకపోవడంపై స్థానికులు చర్చించుకుంటున్నారు. కాగా, మాజీ మేయర్, మాజీ డిప్యూటీ మేయర్ తదితరుల ఫొటోలకు మాత్రం ఫ్లెక్సీలో ప్రాధాన్యం ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.
పార్టీకి చెందిన ముఖ్య నేతల ఫొటోలకు చోటు కల్పించకుండా కొందరు నాయకుల ఫొటోలకే ప్రాధాన్యం ఇవ్వడం వెనుక కారణమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇది పార్టీ అంతర్గత వర్గ విభేదాలకు సంకేతమా? లేక స్థానిక నాయకుల నిర్ణయమా? అనే చర్చ సాగుతోంది. బోనాల పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. పార్టీ నాయకత్వం ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.



