Sunday, August 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రజా వ్యతిరేక విధానాలపై పోరుబాట

ప్రజా వ్యతిరేక విధానాలపై పోరుబాట

- Advertisement -

10న జైల్ భరోకు ప్రజా సంఘాల మద్దతు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 10న నిర్వహించనున్న జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్ లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అధ్యక్షతన ప్రజా సంఘాల సంయుక్త సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నయా ఉదారవాద సంస్కరణలను ముందుకు తీసుకెళ్తూ కార్మికుల హక్కులను హరించే విధంగా వ్యవహరిస్తున్నదన్నారు. లేబర్ కోడ్‌‌ల అమలుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మికులు పోరాడుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ సరవణ బిల్లు-2025ను ప్రవేశపెట్టడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. సులభతర వ్యాపారం పేరుతో విద్యుత్ రంగాన్ని ప్రయివేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

300 మందికి పైగా పనిచేసే కంపెనీల్లో కార్మికులను ఎలాంటి నోటీసు లేకుండా తొలగించే విధానాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పారు. “హైర్ అండ్ ఫైర్” విధానాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మహిళా కార్మికుల రక్షణకు, వారి హక్కులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. లేబర్ కోడ్‌‌లను వెనక్కి తీసుకునేంత వరకు ప్రజా ఉద్యమాలు, జైల్ భరో వంటి కార్యక్రమాలను మరింత ఉదృతం చేస్తామని స్పష్టం చేశారు.తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్ మాట్లాడుతూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు, పంటలకు సమగ్ర మద్దతు, సాగునీరు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధానాలను ఉపసంహరించుకోవాలని, రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు, రైతులు కూడా జైల్ భరో కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారన్నారు.

ఉపాధి హామీ పనులను విస్తరించి, పనిదినాలు పెంచడంతో పాటు కూలీలకు గిట్టుబాటు కూలి అందించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మికులకు ఉపాధి, కనీస వేతనం, సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు, వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఐక్య పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి, స్కైలాబ్ బాబు, రజక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. ఆశయ్య, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ నాయకులు పి. జయలక్ష్మి మాట్లాడారు. రైతు సంఘం రాష్ట్ర కోశాధికారి మూడ్ శోభన్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, పద్మ, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. పద్మశ్రీ, కార్యదర్శులు జె వెంకటేష్, కూరపాటి రమేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు యాటల సోమన్న, రొయ్యల రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -