రాణించిన జడేజా, రాహుల్
భారత్ తొలి ఇన్నింగ్స్ 357/6
దేవదత్ పడిక్కల్ (142) అజేయ సెంచరీతో రాణించాడు. ఓ దశలో ఇతర బ్యాటర్లు విఫలమైన వేళ భారత్ తొలి ఇన్నింగ్స్లో స్వల్ప స్కోరుకే పరిమితమయ్యే ప్రమాదంలో పడగా.. దేవదత్ పడిక్కల్ అజేయ సెంచరీతో ఆదుకున్నాడు. భారత్ తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్లకు 357 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో మరో 6 పరుగుల వెనుకంజలో నిలిచింది. మూడు రోజుల వార్మప్ మ్యాచ్లో నేడు ఆఖరు రోజు.
కొలంబో (శ్రీలంక) : టాప్ ఆర్డర్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ (142 నాటౌట్, 164 బంతుల్లో 18 ఫోర్లు) అజేయ సెంచరీతో చెలరేగాడు. రవీంద్ర జడేజా (63 రిటైర్డ్ హర్ట్, 117 బంతుల్లో 7 ఫోర్లు) నం.4 స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన అజేయ అర్థ సెంచరీతో మెరిశాడు. మానవ్ సుతార్ (41, 90 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), కెఎల్ రాహుల్ (40, 67 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), గుర్నూర్ బరార్ (36 నాటౌట్, 18 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లు) రాణించారు. తొలి ఇన్నింగ్స్లో 90 ఓవర్లలో 6 వికెట్లకు భారత్ 357 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో మరో 6 పరుగుల వెనుకంజలో నిలిచింది. శ్రీలంక ఎలెవన్ తొలి ఇన్నింగ్స్ను ఓవర్నైట్ స్కోరు 363/8 వద్ద డిక్లరేషన్ ప్రకటించింది. దీంతో భారత్ రెండో రోజు ఉదయం నేరుగా బ్యాటింగ్కు వచ్చింది.
పడిక్కల్, జడేజా ఫటాఫట్
యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (0) సున్నా పరుగులకే నిష్క్రమించాడు. ఇటీవల వరుసగా విఫలమవుతున్న యశస్వి జైస్వాల్ మరోసారి నిరాశపరిచాడు. మరో ఓపెనర్ కెఎల్ రాహుల్ (40), దేవదత్ పడిక్కల్ (142) రెండో వికెట్కు 96 పరుగులు జోడించారు. ఐదు ఫోర్లు, ఓ సిక్సర్తో మెరిసిన రాహుల్.. అర్థ సెంచరీ ముంగిట వికెట్ కోల్పోయాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్ గాయంతో బ్యాటింగ్కు సైతం రాలేదు. దీంతో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా నాల్గో స్థానంలో బ్యాట్ పట్టాడు. ఏడు ఫోర్లతో 117 బంతుల్లో 63 పరుగులు చేసిన జడేజా.. సహచరులకు అవకాశం ఇచ్చేందుకు రిటైర్డ్ హర్ట్గా పెవిలియన్కు చేరాడు. పడిక్కల్ సైతం సెంచరీ తర్వాత రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. కానీ ఈ ఇద్దరు క్రీజు వదిలిన తర్వాత.. రిషబ్ పంత్ (2), ధ్రువ్ జురెల్ (1) తేలిపోయారు. దీంతో మళ్లీ దేవదత్ పడిక్కల్ క్రీజులోకి రావాల్సి వచ్చింది. మానవ్ సుతార్ (41) ఐదు ఫోర్లు, ఓ సిక్సర్తో రాణించాడు. ఆఖర్లో గుర్నూర్ బరార్ (36 నాటౌట్) అదిరే ముగింపు అందించాడు. రెండో రోజు ఆట చివరి ఓవర్లో నాలుగు సిక్స్లు కొట్టిన గుర్నూర్ తొలి ఇన్నింగ్స్ లోటును గణనీయంగా తగ్గించాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి దేవదత్ పడిక్కల్, గుర్నూర్ బరార్లు అజేయంగా క్రీజులో నిలిచారు. శ్రీలంక ఎలెవన్ బౌలర్లలో మనోజ్ (2/32), రమేశ్ మెండిస్ (2/77) రెండు వికెట్లు పడగొట్టారు.
స్కోరు వివరాలు
శ్రీలంక ఎలెవన్ తొలి ఇన్నింగ్స్ : 363/8 డిక్లేర్డ్ ( రవిందు రసంత 71, నిశాన్ ఫెర్నాండో 66, సోనల్ దినుశ 52, మానవ్ సుతార్ 2/33, రవీంద్ర జడేజా 2/64, కుల్దీప్ యాదవ్ 2/76)
భారత్ తొలి ఇన్నింగ్స్ : 357/6 (దేవదత్ పడిక్కల్ 142, రవీంద్ర జడేజా 63, మానవ్ సుతార్ 41, మనోజ్ 2/32, రమేశ్ మెండిస్ 2/77)



