అమిత్ షా వివరణ ఇవ్వాలని ప్రతిపక్షాల డిమాండ్
ఆయన సమాధానం ఇస్తారన్న కేంద్రమంత్రి కిరణ్ రిజిజు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, యువకులపై పోలీసులు, కేంద్ర బలగాల క్రూరమైన దాడిపై కేంద్రహోం మంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలని ప్రతిపక్షం చేస్తున్న డిమాండ్కు కేంద్ర ప్రభుత్వం తలొగ్గింది. విద్యార్థుల ఆందోళనకు సంబంధించిన అన్ని ప్రశ్నలకు అమిత్ షా సమాధానమిస్తారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు హామీ ఇచ్చారు. “విద్యార్థుల ఆందోళన, దానికి సంబంధించిన ఇతర అంశాలపై కూలంకషంగా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ అంశంపై జరిగే చర్చకు గానీ, మంత్రి సమాధానానికి గానీ ప్రతిపక్షాలు ఆటంకం కలిగించకూడదు. ప్రభుత్వం, మంత్రి చెప్పే ప్రతి విషయాన్ని వినడానికి మనం సిద్ధంగా ఉండాలి” అని రిజిజు అన్నారు. గత నెల 20న వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజున పార్లమెంటుకు ర్యాలీగా వెళ్లిన విద్యార్థులు, యువకులను ఢిల్లీ పోలీసులు, కేంద్ర బలగాలు క్రూరంగా అణచివేసేందుకు ప్రయత్నించడంతో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగిన విషయం విదితమే.యువకులను పెల్లెట్ గన్లు, మేకులు దింపిన లాఠీలు, ఎలక్ట్రిక్ లాఠీలతో కొట్టారు. సాధారణ దుస్తుల్లో వచ్చిన పోలీసులు యువతులతో దురుసుగా ప్రవర్తించారు. జంతర్మంతర్ వద్ద యువకులను అక్రమంగా రవాణా చేసిన ఘటనపై అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు గత 16 రోజులుగా ఉభయ సభల్లోనూ నిరసన తెలుపుతున్నాయి. అయితే, అమిత్ షా ఇప్పటివరకు సభకు రావడానికి గానీ, వివరణ ఇవ్వడానికి గానీ సిద్ధంగా లేరు. ప్రతిపక్షాల మనోభావాలను అర్థం చేసుకోవాలని రాజ్యసభ చైర్మెన్ సిపి రాధాకృష్ణన్ ఇచ్చిన సూచనలను కూడా అమిత్ షా పట్టించుకోలేదు. అయినప్పటికీ, అమిత్ షా సభకు వచ్చి వివరణ ఇచ్చే వరకూ నిరసన కొనసాగుతుందని ప్రతిపక్షాలు తమ వైఖరిలో దృఢంగా ఉన్నాయి. గురువారంతో వర్షాకాల సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో… హోం మంత్రి సరైన వివరణ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. ఈ పరిస్థితిలో అమిత్ షా పార్లమెంటుకు వచ్చి వివరణ ఇవ్వక తప్పలేదు.
తలొగ్గిన ప్రభుత్వం
- Advertisement -
- Advertisement -



