నవతెలంగాణ – తుంగతుర్తి
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచడం,ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా వసతులు,నాణ్యమైన విద్యను వివరించడమే లక్ష్యంగా ముందస్తు బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నామని వెంపటి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చిత్తలూరి వెంకట్రామ నరసమ్మ అన్నారు. బుధవారం వెంపటి గ్రామపంచాయతీ పరిధిలో ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని ఉత్సాహంగా ప్రారంభించారు.ప్రభుత్వ పాఠశాలలే పిల్లల భవితకు మార్గమని,గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ బడిఈడు పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి మాట్లాడారు. తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా నడుస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని విజ్ఞప్తి చేశారు.
అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యాబోధన అందుబాటులో ఉందని తెలిపారు.మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన అందిస్తున్నామని పేర్కొన్నారు.విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహార మధ్యాహ్న భోజన పథకం గురించి వివరించారు.పాఠశాలల్లో క్రీడా ప్రాంగణాలు,మెరుగైన వసతులు,చదువుకోవడానికి అనువైన వాతావరణం కల్పిస్తున్నట్లు తెలిపారు.గ్రామంలోని ప్రతి బిడ్డ అక్షరాస్యులుగా మారి ఉన్నత లక్ష్యాలు చేరాలన్నదే తమ లక్ష్యమని అన్నారు.గ్రామప్రజల,ప్రజాప్రతినిధుల సమన్వయంతో పాఠశాలల్లో ప్రవేశాలు పెంచడమే ధ్యేయంగా కృషి చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం భీమనపల్లి శ్రీనివాస్,మల్లెపాక రవీందర్,గుండ్ల ఆంజనేయులు,మిట్టగడుపుల విక్రం,జీడి అనిల్ కుమార్,మాలోత్ కృష్ణ,గట్టు మాధవి,బండారు భవాని,నవీన,మౌనిక,మంజుల,రమాదేవి తదితరులు పాల్గొన్నారు.



