నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమాసియాలో యుద్ధానికి ట్రంప్ ముగింపు పలుకనున్నాడని ప్రపంచదేశాలు ఆశగా ఎదురుచూశాయి. కానీ మరోసారి అమెరికా అధ్యక్షుడు బాధ్యతారహిత ప్రకటనలు చేశారు. రెండుమూడు వారాల్లో ఇరాన్పై భీకర బాంబు దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇరాన్ కీలక నాయకత్వం అంతమైందని, ఆ దేశ నౌకాదళం, ఎయిర్ఫోర్స్ తుడిచిపెట్టుకుపోయాయని అన్నారు.
అమెరికా భద్రత కోసమే ఈ ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ని ప్రారంభించామని వ్యాఖ్యానించారు. యూఎస్ను అంతం చేయాలని ఇరాన్ కోరుకుంటోందని ఆరోపించారు. ఈ సందర్భంగా ఇరాన్పై యుద్ధాన్ని త్వరలోనే ముగిస్తామన్నట్లు ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. అమెరికా తన లక్ష్యాలను చేరుకుందని, ఇది అతి త్వరలోనే ముగుస్తుందని అన్నారు.
యుద్ధం నేపథ్యంలో ఇంధన ధరలు పెరగడంపై కూడా ఆయన మాట్లాడారు. ఇది తాత్కాలికమేనని అన్నారు. ఇంధన రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి గురించి కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ జలసంధి నుంచి వచ్చే చమురుపై యూఎస్ ఆధారపడటం లేదని, భవిష్యత్తులో కూడా దాని అవసరం ఉండదని అన్నారు. దీనిపై ఆధారపడిన దేశాలే ధైర్యాన్ని కూడగట్టుకొని జలసంధిని చూసుకోవాలన్నారు. అయితే ఇరాన్ ప్రతీకార దాడులకు గురవుతున్న గల్ఫ్ దేశాలకు తాము అండగా ఉంటామని ట్రంప్ పేర్కొన్నారు.



