Thursday, August 20, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆనాడు ప్రతిపక్ష నేతలను బయటకు రానిచ్చారా?

ఆనాడు ప్రతిపక్ష నేతలను బయటకు రానిచ్చారా?

- Advertisement -

హౌస్‌ అరెస్టులపై బీఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడటం సిగ్గుచేటు
ఆనాడు నిర్బంధాలు.. నేడు ప్రజలకు విముక్తి
ప్రజా సమస్యల పరిష్కారమే మొదటి ప్రాధాన్యత : సంక్షేమ శాఖ మంత్రి 
అడ్లూరి లక్ష్మణ్‌‌కుమార్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

బీఆర్‌ఎస్‌ ‌హయంలో ప్రతిపక్ష పార్టీల నేతలను ఇంటి నుంచి బయటకు వెళ్లనిచ్చారా? అని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌కుమార్‌ బీఆర్‌ ఎస్‌ నేతలను ‌ప్రశ్నించారు. ఆనాడు నిర్బంధాలే లక్ష్యంగా పని చేశారని గుర్తు చేశారు. నేడు ప్రజల వద్దకే పాలన అందిస్తున్నామని తెలిపారు. హౌస్‌ అరెస్టులపై బీఆర్‌ఎస్‌ ‌నేతల మాటలు సి‌గ్గుచేటన్నారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేస్తున్నదని తెలిపారు. బుధవారం హైదరాబాద్‌‌లోని ఇందిరాభవన్‌‌లో నిర్వహించిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అందులో కొన్నింటిని మంత్రి పరిష్కరించారు. మరికొన్నింటిపై ఆయన ఉన్నతాధికారులతో మాట్లాడి మార్గం చూపించారు. అనంతరం మంత్రి విలేకర్లతో మాట్లాడుతూ 2014 నుంచి 2023 వరకు ప్రతిపక్ష నేతలను ఇంటి నుంచి బయటకు రాన్వికుండా నిర్బంధాలు పెట్టిందని విమర్శించారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో కేటీఆర్‌ సిరిసిల్లకు వచ్చిన సందర్భంలో తనను ధర్మపురిలో హౌస్‌ అరెస్టు చేసేవారని గుర్తు చేశారు. నాడు ప్రతిపక్ష నేతలను నిర్బంధించిన వారు…నేడు హౌస్‌ అరెస్టులపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. గత పాలనలో ప్రజల గొంతుకకు అడ్డుకట్ట వేస్తే.. తమ ప్రభుత్వం ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను వింటోందని చెప్పారు. గత బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజల సమస్యలను నేరుగా వినేందుకు అవకాశం కల్పించలేదని విమర్శించారు. ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు సరైన వేదిక లేక ఇబ్బందులను ఎదుర్కొన్నారని చెప్పారు. దీనికి భిన్నంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాపాలనను అమలు చేస్తోందన్నారు. ఎస్సీలు, గిరిజనులు, వికలాంగులు, సీనియర్‌ సిటిజన్స్‌, ట్రాన్స్‌జెండర్లు, పేదలు, అణగారిన వర్గాలకు సంబంధించిన సమస్యలను ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ‘ప్రజల వద్దకే పాలన’ అనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. ప్రజల నుంచి అందిన వినతులు, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును సానుకూల దృక్పథంతో పరిశీలించి, నిబంధనల పరిధిలో సాధ్యమైన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ‘ప్రజల సమస్యలను వినడమే కాదు… వాటికి పరిష్కారం చూపే వరకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్రజలకు అందుబాటులో ఉండే పాలనే మా ప్రభుత్వ విధానం’ అని మంత్రి స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -