– అద్దె భవనాల్లో నిర్వహించే కేంద్రాలకు శాశ్వత భవనాలు నిర్మించాలి
– సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్
నవతెలంగాణ – అశ్వారావుపేట
అంగన్వాడీ కేంద్రాలు ప్రజలు నివసించే ప్రాంతాల్లోనే కొనసాగించాలని, ప్రైవేట్ అద్దె భవనాల్లో ఉన్నాయనే కారణంతో వాటిని దూర ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు తరలించరాదని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ డిమాండ్ చేశారు. అంగన్వాడీ టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం ఐసీడీఎస్ దమ్మపేట సీడీపీవో హేమ సత్యకు సీఐటీయూ నాయకులు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ పేద ప్రజలకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ఐసీడీఎస్ ఏర్పాటైందన్నారు. మండలంలోని అనేక గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలకు శాశ్వత భవనాలు లేకపోవడంతో సగానికి పైగా కేంద్రాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయని తెలిపారు.అద్దె భవనాల్లో కొనసాగుతున్న కేంద్రాలకు శాశ్వత భవనాలు నిర్మించకుండా ప్రభుత్వ పాఠశాలలకు తరలించాలని రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయం నుంచి సర్క్యులర్ జారీ చేయడం సరికాదన్నారు.
అంగన్వాడీ కేంద్రాలను గ్రామాలకు దూరంగా తరలిస్తే గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు పౌష్టికాహారం పొందేందుకు ఇబ్బందులు పడతారని పేర్కొన్నారు. పేదలకు అనుకూలమైన ప్రాంతాల్లోనే కేంద్రాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. కేంద్రాల్లో చిన్నారులకు అనుకూలమైన అభ్యసన వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రైవేట్ అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలకు ఏడాది నుంచి అద్దెలు ప్రభుత్వం చెల్లించలేదని తెలిపారు. వెంటనే కేంద్రాల అద్దెలతో పాటు గ్యాస్, కూరగాయల బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ మురహరి రఘు, జ్యోతి, జయ, గౌసియా తదితరులు పాల్గొన్నారు.



