ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం
900 ఏండ్ల చరిత్ర కలిగిన ఆక్స్ఫర్డ్ విద్యావేత్తలతో సీఎం చర్చలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణలో విద్యా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలని… లండన్ లోని ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆహ్వానం పలికారు. తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందంలో భాగంగా ఆయన శుక్రవారం 900 ఏండ్ల చరిత్ర కలిగిన ప్రపంచ ప్రఖ్యాత లండన్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని సందర్శించారు. తెలంగాణతో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ భాగస్వామ్య అవకాశాలు, రాష్ట్ర యువతకు ప్రపంచస్థాయి విద్య, పరిశోధన అవకాశాలు కల్పించే అంశాలపై ప్రముఖ విద్యావేత్తలతో విస్తృతంగా చర్చించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిధిలోని బ్లావాట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్కు చెందిన ప్రొఫెసర్ మాయా ట్యూడర్, బేలియోల్ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ ఫైసల్ దేవ్జీతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ‘తెలంగాణ రైజింగ్’ విజన్ను వారికి సమగ్రంగా వివరించారు. హైదరాబాద్ను ప్రపంచస్థాయి విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రణాళికలు, చేపడుతున్న చర్యలను వివరించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తమ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలు, ప్రత్యేక పరిశోధన సామర్థ్యాలు, విస్తృతమైన విద్యా వ్యవస్థను హైదరాబాద్కు తీసుకురావాలని ఆహ్వానించారు.
హైదరాబాద్లో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి, తెలంగాణ యువతకు, ఉద్యోగ నిపుణులకు ప్రపంచస్థాయి విద్యా, పరిశోధన అవకాశాలు అందించేందుకు ముందుకు రావాలని కోరారు. ఈ కీలక సమావేశంలో సీఎం కార్యాలయ సలహాదారు, ఎక్స్అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ జాతీయ విద్యా విధానం కింద విదేశీ విశ్వవిద్యాలయాలకు అందుబాటులో ఉన్న అవకాశాలపై ఆయన సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు. హైదరాబాద్, తెలంగాణలో విదేశీ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసుకునేందుకు ఉన్న అవకాశాలు, వాటికి లభించే ప్రయోజనాలను వివరించారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ప్రొఫెసర్లు మాయా ట్యూడర్, ఫైసల్ దేవ్జీ సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర యువత, ఉద్యోగ నిపుణులతో కలిసి పనిచేయడానికి ఆసక్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వంతో విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో భాగస్వామ్యానికి ఉన్న పలు అవకాశాలను ఈ సందర్భంగా వారు ప్రస్తావించారు.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానం
డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ప్రతినిధి బృందాన్ని పంపాలని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులను తెలంగాణ బృందం ఆహ్వానించింది. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చారిత్రక సోమర్విల్ కాలేజీని సందర్శించారు. ఈ కాలేజీలో విద్యాభ్యాసం చేసిన దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చిత్రపటాన్ని సందర్శించారు. 2002లో సోనియా గాంధీ ఈ చిత్రపటాన్ని సోమర్విల్ కాలేజీకి బహూకరించిన విషయం తెలిసిందే. అనంతరం ముఖ్యమంత్రి, అక్కడే జీఎంఆర్ గ్రూప్ నిర్వహిస్తున్న యుటిలిటా బౌల్ను సందర్శించారు. జీఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ చైర్మన్ కిరణ్ కుమార్ గ్రంథితో కలిసి అక్కడి సమగ్ర క్రీడా సదుపాయాలను పరిశీలించారు. ఈ ప్రాంగణంలో గోల్ఫ్ కోర్స్తో పాటు వివిధ క్రీడలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, హోటల్ ఉన్నాయి. తెలంగాణలో ప్రపంచస్థాయి క్రీడా మౌలిక సదుపాయాల ఏర్పాటుపై జీఎంఆర్ ప్రతినిధులు, సంస్థ గ్లోబల్ స్పోర్ట్స్ యూనిట్తో సీఎం మంతనాలు జరిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి, ప్రపంచస్థాయి క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని వారిని ఆహ్వానించారు. శుక్రవారం సాయంత్రం ప్రస్తుత ప్రీమియర్ లీగ్ చాంపియన్స్ ఆర్సెనల్, కోవెంట్రీ మధ్య జరిగే ఈపీఎల్ మ్యాచ్ను వీక్షించేందుకు ముఖ్యమంత్రి ఎమిరేట్స్ స్టేడియాన్ని సందర్శించనున్నారు.
రాష్ట్రంలో విద్యా కార్యక్రమాలు చేపట్టండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


