నవతెలంగాణ – అశ్వారావుపేట
దమ్మపేట మండలం మొద్దులగూడెం ఎస్సీ కాలనీలో కొంతకాలంగా నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ స్థానిక మహిళలు ఆదివారం రోడ్డుపై ధర్నా చేపట్టారు. తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, సమస్యను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ధర్నాకు సీపీఐ(ఎం) మండల కమిటీ నాయకులు, కార్యకర్తలు సంఘీభావం తెలిపారు.
కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్య విషయం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన అనంతరం కాలనీలో కొత్త బోర్వెల్ మంజూరు చేయించారు. అనంతరం బోర్వెల్ ఏర్పాటు చేయడంతో తాగునీటి సమస్యకు పరిష్కారం లభించిందని స్థానికులు తెలిపారు.
తాగునీటి సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకున్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణకు, ధర్నా కు సంఘీభావం తెలిపిన సీపీఐ (ఎం) నాయకులు దొడ్డా లక్ష్మినారాయణ,మోరంపుడి శ్రీనివాస్ రావు లకు మొద్దులగూడెం ఎస్సీ కాలనీ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.



