మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు
ప్యాడ్ బ్యాండ్ కళాకారులను ఇబ్బందులు పెట్టొద్దు
ప్రజల ఆరోగ్యం దృష్ట్యా డీజేలను వ్యతిరేకిస్తున్నాం
భాగ్యనగర్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి రావినూతల శశిధర్
తెలంగాణ బ్యాండ్ వాయిద్య కళాకారుల సంఘం రౌండ్ టేబుల్ సమావేశం
నవతెలంగాణ – ముషీరాబాద్
సౌండ్ రెగ్యులేషన్ కంట్రోల్ కమిషన్ను ఏర్పాటు చేసి ధ్వని కాలుష్య నియంత్రణకు స్పష్టమైన నిబంధనలు రూపొందించాలని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వినాయక చవితి ఉత్సవాల్లో ప్యాడ్ బ్యాండ్ వాహనాలకు అనుమతివ్వాలని కోరుతూ మంగళవారం హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ బ్యాండ్ వాయిద్య కళాకారుల సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
అశ్వాల హనుమంత్ అధ్యక్షత వహించగా, రాష్ట్ర కార్యదర్శి గుమ్మడి రాజు నాగరాజు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. బ్యాండ్ కళాకారుల సమస్యలను మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఇప్పటికే డీజీపీ, మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లామని తెలిపారు. బోనాల పండుగ ప్రశాంతంగా జరిగేందుకు ఇది కూడా దోహదపడిందన్నారు.
బ్యాండ్ కళాకారులు సైతం అధిక శబ్దంతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా నియంత్రిత స్థాయిలోనే ధ్వని వినియోగించాలని సూచించారు. ప్రత్యేక పండుగల సందర్భంగా ఏడాదిలో 30 రోజులపాటు అనుమతులు ఇచ్చేలా ప్రభుత్వం చట్టం చేయాలని కోరారు. సౌండ్ రెగ్యులేషన్ కమిషన్ ఏర్పాటు చేసి సౌండ్ ఎంత పెట్టాలని నిబంధనలు ఉన్నప్పుడు ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు.
భాగ్యనగర్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి రావినూతల శశిధర్ మాట్లాడుతూ.. వినాయక చవితి ఉత్సవాల్లో బ్యాండ్ కళాకారులపై ఆంక్షలు విధించడం సరికాదన్నారు. పండుగల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నప్పుడు బ్యాండ్ కళాకారులకు ఉపాధి ఎందుకు కల్పించకూడదని ప్రశ్నించారు. గణేష్ ఉత్సవాల ద్వారా మండపాల నిర్మాణం నుంచి నిమజ్జన శోభాయాత్ర వరకు వేలాది కుటుంబాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని తెలిపారు. ధ్వని కాలుష్యం పేరుతో పేద బ్యాండ్ కళాకారుల ఉపాధిని దెబ్బతీయొద్దన్నారు. అయితే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని డీజేలను మాత్రం వ్యతిరేకిస్తున్నామని, అదే సమయంలో ప్యాడ్ బ్యాండ్ కళాకారులను ఇబ్బందులకు గురిచేయొద్దని ప్రభుత్వాన్ని కోరారు. బ్యాండ్ వాహనాలను సీజ్ చేయడం, కళా కారులపై కేసులు నమోదు చేయడం వంటి చర్యలను భాగ్యనగర్ ఉత్సవ సమితి వ్యతిరేకిస్తుందని చెప్పారు. కళా కారుల ఆందోళనలకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. సౌండ్ రెగ్యులేషన్ కంట్రోల్ కమిషన్ ఏర్పాటు చేయాలన్న బ్యాండ్ వాయిద్య కళాకారుల ప్రధాన డిమాండ్పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వెంటనే నిర్ణయం ప్రకటించాలని కోరారు. ఈ సమావేశంలో హైద రాబాద్ జిల్లా కార్యదర్శి వేముల శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్య క్షులు రాచర్ల శేఖర్, హైదరాబాద్ సంఘం గౌరవ అధ్యక్షుడు సురేందర్ శెట్టి, నాయకులు దేవేందర్, ప్రవీణ్, హుస్సేన్, మురళి పాల్గొన్నారు.
సౌండ్ రెగ్యులేషన్ కంట్రోల్ కమిషన్ వేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



