– అధికారులకు అదనపు కలెక్టర్ విక్టర్ ఆదేశం
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్ ప్రజల నుంచి 58 ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజలు సమర్పించిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు పంపించి, నిబంధనల మేరకు క్షుణ్ణంగా పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తుపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పరిష్కరించగల సమస్యలను ఎలాంటి జాప్యం లేకుండా పరిష్కరించాలని సూచించారు. ఇతర శాఖల సమన్వయం అవసరమైన అంశాలపై సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని నిర్ణీత సమయంలో చర్యలు చేపట్టాలని తెలిపారు.
ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై నమ్మకంతో ప్రజావాణిని ఆశ్రయిస్తున్నందున, వారి దరఖాస్తులపై అధికారులు బాధ్యతాయుతంగా స్పందించి, సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అదనపు కలెక్టర్ విక్టర్ స్పష్టం చేశారు. ప్రజావాణిలో అందిన దరఖాస్తులను సంబంధిత అధికారులు ఆన్లైన్లో నమోదు చేసి, వాటి పరిష్కార పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి, సీఈఓ చందర్, ట్రైనింగ్ కలెక్టర్ రవితేజ, డీఆర్వో పాండు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.


